బెంగళూరు, జూలై 25: కర్ణాటకలో బీజేపీతో జేడీఎస్ పొత్తు ఊహాగానాలకు తెరపడింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఒకటి రెండు సీట్లొచ్చినా పర్వాలేదు. ఏ పార్టీతో పొత్తు లేకుండా స్వతంత్రంగానే పోటీ చేస్తాం’ అని చెప్పారు. నేతలు, కార్యకర్తలతో సంప్రదించిన తర్వాత పార్టీ బలంగా ఉన్న స్థానాలలో ఒంటరిగానే పోటీకి దిగుతామన్నారు. అయితే భవిష్యత్తులో ఆయా రాజకీయ పరిస్థితులను బట్టి నిర్ణయాలను తీసుకుంటామని చెప్పారు.