బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శివానంద పాటిల్ (54) హఠాన్మరణం పాలయ్యారు. కర్ణాటక అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జేడీఎస్ ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. శివానంద పాటిల్ను సిందగీ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ఖరారు చేసింది.
ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ప్రచారానికి ఏర్పాట్లు చేసుకుంటున్న శివానంద పాటిల్.. ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. కాగా, పాటిల్ మృతికి జేడీఎస్ అగ్రనేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తీవ్ర సంతాపం తెలిపారు. పాటిల్ ఆత్మకు శాంతి కలుగాలని, ఆయన కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు.
కాగా, శివానంద పాటిల్ సైన్యంలో నిస్వార్థ సేవలు అందించి పదవీ విరమణ పొందారు. రిటైర్మెంట్ తర్వాత జేడీఎస్లో చేరిక ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇంతలోనే ఆయన అనంతలోకాలకు వెళ్లిపోయారు. శివానంద పాటిల్కు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు.