ఢిల్లీ : ప్రముఖ ఎర్త్మూవింగ్, నిర్మాణ పరికరాల తయారీ సంస్థ జేసీబీ ఇండియా దేశంలోని అన్ని ఉత్పాదక సంస్థలలో తన కార్యకలాపాలను 10 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కొవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తయారీ కార్యకలాపాలను 10 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేయాలని నిశ్చయించినట్లు సంస్థ పేర్కొంది. మే 1వ తేదీ నుండి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది.
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బల్లాబ్గర్, పూణే, జైపూర్లోని తమ అన్ని తయారీ ప్రదేశాలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని జేసీబీ ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ శెట్టి తెలిపారు. కంపెనీ ప్రస్తుతం తొమ్మిది విభాగాలలో 60 కి పైగా ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఈ ఉత్పత్తులు భారతదేశంలో మాత్రమే కాకుండా 110 దేశాలకు ఎగుమతి చేయబడుతుంటాయి.