న్యూఢిల్లీ: డీఎంకే పార్టీ వైఖరిని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తప్పుపట్టారు. ఇవాళ లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ నేపథ్యంలో తమిళనాడు దివంగత సీఎం జయలలితకు 1989లో జరిగిన అవమానాన్ని ఆమె గుర్తు చేశారు. అవిశ్వాసం తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ.. మహిళల్ని వేధిస్తున్నారని, నగ్నంగా ఊరేగిస్తున్నారని కేంద్రంపై ఆరోపణలు చేశారు. అయితే కనిమొళి వ్యాఖ్యలను ఇవాళ మంత్రి సీతారామన్ తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ.. డీఎంకే వ్యవహరించిన తీరును ఖండించారు.
మణిపూర్, ఢిల్లీ, రాజస్థాన్లో మహిళలు ఆవేదనకు గురవుతున్న విషయాన్ని అంగీకరిస్తున్నానని, ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని మంత్రి నిర్మల పేర్కొన్నారు. దీంట్లో ఎటువంటి రాజకీయం అవసరం లేదని, అయితే 1989లో తమిళనాడులో జరిగిన ఘటనను ఆమె గుర్తు చేశారు. తమిళనాడు అసెంబ్లీలో జయలలిత చీరను లాగేశారని, ఆ సమయంలో ఆమె అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్నారని, జయ చీరను లాగి ఆమెపై వెకిలి నవ్వులు నవ్వారని మంత్రి నిర్మల ఆరోపించారు.
జయలలిత ఘటనను డీఎంకే మరిచిపోయిందా అని మంత్రి ప్రశ్నించారు. జయ చీరను లాగింది మీరు, ఆమెను అవమానపరిచింది మీరే అంటూ మంత్రి నిర్మల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అవమానం జరిగిన రోజునే ఆమె శపథం తీసుకున్నారని, సీఎం అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెట్టనున్నట్లు చెప్పిందన్నారు. ఆ ఘటన తర్వాత రెండేళ్లకే జయ తమిళనాడు సీఎం అయ్యారని నిర్మల పేర్కొన్నారు. ఇదే అంశాన్ని నొక్కి చెబుతూ మంత్రి నిర్మల తమిళంలోనూ మాట్లాడారు.
#WATCH | FM says, "I agree that women suffering anywhere – Manipur, Delhi, Rajasthan – will have to be taken seriously. No politics played. But I want to remind this entire House of one incident which happened on 25th March 1989 in Tamil Nadu Assembly. Then she hadn't become CM… pic.twitter.com/DRUTV4qeIg
— ANI (@ANI) August 10, 2023