చెన్నై: తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలితకు చెందిన నివాసాన్ని ఆమె మేనకోడలు దీపా జయకుమార్ న్యాయపోరాటం ద్వారా స్వాధీనం చేసుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు చెన్నైలోని జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ నివాసాన్ని జిల్లా అధికారులు దీపకు అప్పగించారు. దీంతో శుక్రవారం సాయంత్రం దీప తన భర్త మాధవన్, మరి కొందరితో కలిసి ఆ నివాసానికి చేరుకున్నారు. జయలలిత చిత్రపటానికి పూల మాలవేసి నివాళి అర్పించారు.
‘అత్త (జయలలిత) లేకుండా నేను ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. ఇప్పుడు ఈ ఇల్లు నిర్మానుష్యంగా, ఖాళీగా ఉంది. మా అత్త ఉపయోగించిన ఫర్నిచర్ను తొలగించారు’ అని దీప తెలిపారు. తన అత్త జయలలితకు చెందిన ఈ ఇంట్లో తాను నివాసం ఉంటానని ఆమె చెప్పారు.
కాగా, జయలలిత మరణాంతరం ఆమె నివాసమైన వేద నిలయాన్ని నాటి అన్నాడీఎంకే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. జయలలిత స్మారక మందిరంగా దీనిని తీర్చిదిద్దుతామని పేర్కొంది. ఈ భవనం స్వాధీనానికి డబ్బులను కూడా కోర్టుకు జమ చేసింది.
మరోవైపు జయలలిత ఆస్తులకు తామే వారసులమంటూ ఆమె మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పోయెస్ గార్డెన్ నివాసాన్ని అన్నాడీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాల్ చేశారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు దీప, దీపక్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. జయలలిత నివాసాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం చట్ట విరుద్ధమని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
‘ఈ కొనుగోలులో ప్రజాప్రయోజనాలేమీ లేవు. ఇప్పటికే మెరీనా బీచ్ వెంబడి జయలలితకు రూ.80 కోట్ల స్మారక చిహ్నం ఉంది. రూ.80 కోట్ల మెరీనా మెమోరియల్ అందించని స్పూర్తి వేద నిలయం అందిస్తుందా?’ అని ప్రశ్నించింది. వేద నిలయాన్ని జయలలిత వారసులకు అప్పగించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం నవంబర్ 24న ఆదేశించింది. దిగువ కోర్టులో డిపాజిట్ చేసిన డబ్బును వెనక్కి తీసుకోవాలని పేర్కొంది.
చెన్నై జిల్లా కలెక్టర్ వేద నిలయం తాళాలను దీప, దీపక్కు అప్పగించారు. మరోవైపు హైకోర్టు ఆదేశాన్ని ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తామని అన్నాడీఎంకే పేర్కొంది.