న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో భారత్లో రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులను జపాన్ పెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో కలిసి ద్వైపాక్షిక 14వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. అనంతరం ఇరు దేశాధి నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ప్రపంచం ఇంకా కరోనా ప్రభావం నుంచి బయటపడలేదని ప్రధాని మోదీ అన్నారు. ఆర్థిక పునరుద్ధరణకు ప్రపంచం ఇంకా అడ్డుంకులను ఎదుర్కొంటోందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొత్త సవాల్ అని అన్నారు. భారత్, జపాన్ భాగస్వామ్యం మరింత బలోపేతం వల్ల ఇండో-పసిఫిక్ ప్రాంతంతోపాటు ప్రపంచ స్థాయిలో శాంతి, శ్రేయస్సు, స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుందని ఆకాక్షించారు.
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా రెండు రోజుల భారత్ పర్యటన కోసం ప్రత్యేక విమానంలో శనివారం ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయనకు ఎయిర్పోర్ట్ వద్ద స్వాగతం పలికారు. హైదరాబాద్ హౌస్కు చేరుకున్న జపాన్ ప్రధాని కిషిడాకు, ప్రధాని నరేంద్ర మెదీ స్వాగతం పలికారు. అనంతరం భారత్-జపాన్ 14వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఇరు దేశ ప్రధానులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఇండో-పసిఫిక్లో శాంతి, స్థిరత్వం, పెట్టుబడులు, సహకారంపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్, జపాన్ మధ్య ఆరు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. క్లీన్ ఎనర్జీపై భాగస్వామ్యం గురించి కూడా ఇరు దేశాలు ప్రకటించాయి.