న్యూఢిల్లీ: డీడీలో ప్రసారం అయిన రామాయణం సిరీయల్లో లక్ష్మణుడి పాత్రను నటుడు సునిల్ లహ్రి(Sunil Lahri) పోషించిన విషయం తెలిసిందే. రామానంద్ సాగర్ తీసిన ఆ సిరీస్ చాలా ఫేమస్. అయితే జనవరి 22వ తేదీ భారత్కు చాలా చరిత్రాత్మకమైందని, ఆ రోజున అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగనున్నట్లు ఆయన చెప్పారు. మూడు దశాబ్ధాల క్రితం తొలిసారి అయోధ్యకు వెళ్లానని, ఆ సమయంలో రాముడి విగ్రహాన్ని ఓ టెంట్లో పెట్టారని, అలా చూడడం చాలా బాధ కలిగించిందని సునిల్ లహ్రి గుర్తు చేశారు. రాముడు ఇక్కడే పుట్టారని, ఇప్పుడు ఆయన్ను ఇలా టెంటులో పెట్టారని తనకు తానే ఫీలయ్యానని, కానీ రోజులు మారాయని, న్యాయం సరైన మార్గంలో ప్రయాణించిందని లహ్రి తెలిపారు. గడిచిన 500 ఏండ్ల నుంచి భారత్ పోరాటం చేస్తోందని, జనవరి 22 ఘటన అతిపెద్ద అచీవ్మెంట్ అని పేర్కొన్నారు. ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారన్నారు.
నిజాయితీ, పట్టుదల, నిరాడంబరతకు లక్ష్మణుడు సంకేతమని సునిల్ లహ్రి తెలిపారు. మంచి కోసం లక్ష్మణుడు ఎప్పుడూ అండగా నిలిబడినట్లు చెప్పారు. ఎటువంటి తప్పును లక్ష్మణుడు సమర్థించడు అని, అది అతని క్యారెక్టర్ అని పేర్కొన్నారు. ప్రభువు శ్రీరాముడికి నీడలాంటి వాడు లక్ష్మణుడన్నారు. రాముడు సాధారణంగా చాలా ప్రశాతంగా, మౌనంగా, గంభీరంగా ఉంటాండన్నారు. రాముడికి భిన్నంగా లక్ష్మణుడుంటారన్నారు. మనుషుల్లో ఉన్న భిన్న వ్యక్తిత్వాలకు రామ, లక్ష్మణులు సంకేతమన్నారు.కొన్ని సందర్భాల్లో రాముడిలా ఉండాలని, మరికొన్ని సందర్భాల్లో లక్ష్మణుడిలా ఉండాలన్నారు.
ఇటీవల కొందరు సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందిస్తూ.. బహుశా వాళ్లకు సనాతన ధర్మం అంటే ఏమిటో అర్థం కాలేదనుకుంటానన్నారు. సనాతన ధర్మం చాలా విశాలమైందని, అన్ని నెగటివ్ శక్తుల్ని కూడా లాగేసే శక్తి ఆ ధర్మానికి ఉందన్నారు. విదేశీయులు చాలా పెద్ద సంఖ్యలో సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారని, ఆ ధర్మాచరణ ద్వారా వాళ్లు శాంతిని పొందుతున్నట్లు చెప్పారు. అయోధ్య నగరం చాలా మారిపోయిందని, భవిష్యత్తులో అది క్లాస్ సిటీగా మారుతుందన్నారు.