Anantnag | జమ్మూకశ్మీర్ అనంత్నగర్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. సైనికుడితో పాటు మరో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని కోకెర్నాగ్లోని అహ్లాన్ గగుర్ముండు ప్రాంతంలో ఉగ్రవాదులు సంచారిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని చేరుకొని కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదులు తనిఖీలు చేస్తున్న భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. అటవీ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారని.. వారిని సైనం చుట్టుముట్టినట్లు తెలుస్తున్నది.
ప్రస్తుతం సంఘటనా స్థలంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లుగా ఆర్మీ అధికారులు తెలిపారు. ఇంతకు ముందు 6న బసంత్గఢ్ ప్రాంతంలో సాయంత్రం 4 గంటలకు భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. రెండు గంటలపాటు ఇరువైపులా కాల్పులు జరిగాయి. ప్రతికూల వాతావరణం, పొగమంచు మధ్య సాయంత్రం వరకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.