న్యూఢిల్లీ : జమ్మూలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ( IAF ) స్టేషన్పై గత వారం డ్రోన్ల దాడి జరిగిన విషయం విదితమే. అయితే నాడు డ్రోన్ల సాయంతో పేలుళ్లకు పాల్పడిన ఐఈడీ బాంబుల్లో ఆర్డీఎక్స్, నైట్రేట్ వినియోగించినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ ( FSL ) నివేదికలో తేలింది. ఆర్డీఎక్స్ ఇండియాలో లభ్యం కావడం లేదని, దాన్ని పాకిస్తాన్ నుంచే తెచ్చి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ దాడి వెనుక పాక్ ఉగ్రవాదులే ఉన్నారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఒక ఐఈడీ భారీ పరిణామంలో ఉండగా.. దాన్ని మౌలిక వసతులను పేల్చేందుకు ఉపయోగించారు. రెండో ఐఈడీని అధికారులు, సైనికులే లక్ష్యంగా పేల్చారు.ఈ దాడికి ఉపయోగించిన జీపీఎస్ డ్రోన్ చైనా ప్రొడక్ట్ అయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
జమ్మూ వైమానిక స్థావరంపై డ్రోన్లతో దాడికి పాల్పడింది లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థనే అని జమ్మూ డీజీపీ దిల్బాగ్ సింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ( NIA ) దర్యాప్తు చేస్తోంది.