ముంబై, ఏప్రిల్ 24: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రద్దు చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈ నిర్ణయం బ్యాంక్ పనిగంటలు ముగిసిన మరుక్షణం నుంచే అమల్లోకి వస్తుందని కూడా సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ నిబంధనల్ని పేటీఎం యాజమాన్యం పాటించడం లేదన్న ఆర్బీఐ.. డిపాజిటర్ల ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా వ్యాపార కార్యకలాపాలు జరుగుతున్నాయని ఈ మేరకు విడుదలైన ఓ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం-1949లోని సెక్షన్ 22 (3), (సీ), (ఈ), (జీ) నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆర్బీఐ వెల్లడించింది. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్లో పేటీఎం షేర్లు కూడా నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో 0.56 శాతం పడిపోయి రూ.1,153 వద్ద సంస్థ షేర్ విలువ నిలిచింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో అవకతవకల్ని నాలుగేండ్ల కిందటే రిజర్వ్ బ్యాంక్ గుర్తించింది. ఈ క్రమంలోనే ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాలతో 2022 మార్చి 11 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో కొత్త కస్టమర్లను చేర్చుకోవడం ఆగిపోయింది. ఆ తర్వాత 2024 జనవరి 31న, ఫిబ్రవరి 16న కూడా వివిధ వ్యాపారపరమైన ఆంక్షల్ని విధించిన సంగతీ విదితమే. అప్పట్లోనే డిపాజిట్లను తీసుకోవద్దని, ఖాతాదారులకు కొత్తగా రుణాలు మంజూరు చేయవద్దనడమేగాక.. ప్రీపెయిడ్ సాధనాలు, వ్యాలెట్లు తదితరాల్లో టాప్-అప్లకూ బ్రేక్ వేసింది. ఇప్పుడు మొత్తం బ్యాంక్ లైసెన్స్నే రద్దు చేసింది. అంతేగాక హైకోర్టులో బ్యాంక్ మూసివేతకు దరఖాస్తు కూడా చేయనున్నది. ప్రజల అవసరాలకు ఈ బ్యాంక్తో ఏమాత్రం పనిలేదంటున్నది మరి.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు చెందిన డిపాజిటర్లకు ఎటువంటి నష్టం జరుగదని ఆర్బీఐ తెలిపింది. తీసుకున్న డిపాజిట్లను తిరిగి చెల్లించడానికి సరిపడా నగదు నిల్వలు బ్యాంక్ వద్ద ఉన్నట్టు స్పష్టం చేసింది. కాబట్టి డిపాజిటర్లు భయపడాల్సిన పనిలేదన్నది. కాగా, విజయ్ శేఖర్ శర్మ ప్రమోట్ చేస్తున్న ఫిన్టెక్ కంపెనీ పేటీఎంలో భాగమే ఈ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అన్న విషయం తెలిసిందే. 2017 మే 23 నుంచి ఇది పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలను ప్రారంభించింది. కానీ బ్యాంకింగ్ కార్యకలాపాల్లో నిబంధనల ఉల్లంఘనతో ఐదేండ్లు కూడా కాకముందే ఆర్బీఐ ఆంక్షలపాలైంది. పేటీఎం బ్రాండ్ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్కు చెందినదన్నది విదితమే.
‘పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్కు జారీ చేసిన లైసెన్స్ను బ్యాంకింగ్ నియంత్రణ చట్టం-1949లోని సెక్షన్ 22(4) కింద రద్దు చేస్తున్నాం. తక్షణమే (ఏప్రిల్ 24, 2026 నుంచి) వ్యాపార కార్యకలాపాలను ఆపేస్తున్నాం. కాబట్టి చట్టంలోని సెక్షన్ 5(బీ)లో సూచించినట్టుగా బ్యాంకింగ్ వ్యాపారం, సెక్షన్ 6 కింద పేర్కొన్న అదనపు వ్యాపార కార్యకలాపాలు చేయడం ఇకపై నిషేధం. హైకోర్టులో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మూసివేతను కోరుతూ ఓ దరఖాస్తునూ పెడుతాం’
– ఆర్బీఐ ప్రకటన