జమ్మూ : శీతల ప్రాంతమైన జమ్మూలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం ఉష్ణోగ్రతలు 37.3 డిగ్రీలకు చేరగా.. 76 సంవత్సరాల రికార్డు బద్దలైంది. ఇంతకు ముందు 1945 మార్చి 31న 37.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ డైరెక్టర్ సోనమ్ లోటస్ తెలిపారు. గత నాలుగు రోజుల నుంచి జమ్మూ కాశ్మీర్లో వాతావరణం ప్రశాంతంగా, ఆకాశం స్పష్టంగా ఉందన్నారు. రాబోయే కొద్ది రోజులు పొడి, వేడి వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్పారు. వాతావరణ శాఖ ప్రకారం, కేంద్ర పాలిత ప్రాంతమైన శీతాకాలపు రాజధాని జమ్మూలో ఈ సీజన్లో గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే 8.4 డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది.
అయితే, రాత్రి ఉష్ణోగ్రత 16.9 డిగ్రీల సెల్సియస్ వద్ద సాధారణ స్థాయికి చేరుకుందని ఆ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. వేసవి రాజధాని శ్రీనగర్లో సాధారణం కంటే వేడిగా ఉంటున్నది. పగటి ఉష్ణోగ్రత 25 డిగ్రీలు కాగా.. రాత్రి ఉష్ణోగ్రత 7.2 డిగ్రీలుగా ఉందని.. సాధారణం కంటే 1.1 డిగ్రీలు ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రాన్ని సందర్శించే యాత్రికుల బేస్ క్యాంప్ అయిన కత్రాలో అత్యధికంగా 32.3 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 16.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు తెలిపారు.