జమ్ము, డిసెంబర్ 11: జమ్ముకశ్మీర్లో నివసిస్తున్న కుటుంబాలకు సంబంధించి ఓ డాటాబేస్ ఏర్పాటు చేసే ప్రణాళికలో స్థానిక పాలన యంత్రాంగం ఉన్నది. ఇందులో భాగంగా ప్రతి కుటుంబానికి ఇంగ్లిషు అక్షరాలు, అంకెలతో కూడిన ఓ ప్రత్యేక ఐడీ కేటాయించనున్నారు. సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను సులభంగా ఎంపిక చేసే ఉద్దేశంతో ఈ వ్యవస్థను తీసుకువస్తున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ ‘ఫ్యామిలీ ఐడీ’ ప్లాన్ను బీజేపీ స్వాగతించగా.. ప్రతిపక్ష పార్టీల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పౌరుల వ్యక్తిగత డాటా భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటీవల రేసీ జిల్లాలోని కత్రాలో ఈ-గవర్నెన్స్పై జరిగిన జాతీయ సదస్సు సందర్భంగా జమ్ముకశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ జనరల్ మనోజ్ సిన్హా డిజిటల్ జమ్ముకశ్మీర్ విజన్ డాక్యుమెంట్ను విడుదల చేశారు. జమ్ముకశ్మీర్లోని అన్ని కుటుంబాలకు ప్రామాణికమైన, ధ్రువీకరించిన డాటాబేస్ను రూపొందించే ప్రభుత్వ ప్రణాళికను ఆవిష్కరించారు. కుటుంబ సమ్మతితో సేకరించిన డాటాను డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేస్తామని విజన్ డాక్యుమెంట్ పేర్కొన్నది.
వ్యతిరేకిస్తున్న విపక్షాలు
డాటాబేస్ ఏర్పాటును ప్రతిపక్ష కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇందులో ప్రభుత్వం ఉద్దేశంతో పాటు సైబర్ దాడుల నుంచి డిజిటల్ డాటాబేస్కు రక్షణ కల్పించే సామర్థ్యం ఉన్నదా? అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవీందర్ శర్మ ప్రశ్నించారు.