Hemant Soren | రాంచీ : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ లోక్సభ ఎన్నికల్లో దమ్కా ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తలకు జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) గురువారం తెర దించింది. దమ్కా లోక్సభ స్థానానికి శికరిపాడ ఎమ్మెల్యే నలిన్ సోరెన్ను జేఎంఎం నామినేట్ చేసింది. అదే విధంగా గిరిధిహ్ ఎంపీ స్థానానికి తుండి ఎమ్మెల్యే మథుర ప్రసాద్ను బరిలో దింపింది. దమ్కా నుంచి నలిన్ సోరెన్ను బరిలో ఉంచడంతో హేమంత్ సోరెన్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టమైంది.
ఇక దమ్కా నియోజకవర్గం నుంచి హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ను బీజేపీ బరిలో దింపింది. సిట్టింగ్ ఎంపీ సునీల్ సోరెన్నే దమ్కా నుంచి పోటీ చేస్తారని మార్చి 2వ తేదీన బీజేపీ ప్రకటించింది. కానీ అనుహ్యంగా సీతా సోరెన్ను బీజేపీలో చేర్చుకుని, ఆమెకు దమ్కా నుంచి అవకాశం కల్పించారు.
2019 లోక్సభ ఎన్నికల్లో జేఎంఎం చీఫ్ శిబు సోరెన్పై సునీల్ సోరెన్ 47,590 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సీతా సోరెన్ మూడుసార్లు జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. శిబు సోరెన్ కోడలు అయిన సీతా సోరెన్ గత నెలలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. 2009లో తన భర్త దుర్గా సోరెన్ మరణించిన తర్వాత జేఎంఎం తనను నిర్లక్ష్యం చేసిందని, రాజకీయంగా ఎదగనివ్వలేదని సీతా సోరెన్ ఆరోపించారు.