ముంబై: పౌర, మానవ హక్కుల కార్యకర్త గౌతమ్ నవలఖా గృహ నిర్బంధానికి సుప్రీంకోర్టు గురువారం అనుమతించింది. అనారోగ్య కారణాలతో వైద్యం కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్పై సానుకూలంగా స్పందించింది. న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, హృషికేష్ రాయ్లతో కూడిన ధర్మాసనం నవలఖాకు ఊరట ఇచ్చింది. బేలాపూర్లోని ఆయన ఇంట్లో నెల రోజుల పాటు గృహనిర్బంధంలో ఉండేందుకు అనుమతించింది.
అయితే సుప్రీంకోర్టు పలు షరతులు విధించింది. పోలీస్ సిబ్బంది కోసం ఎన్ఐఏ పేర్కొన్న ఖర్చులకుగాను రూ.2.4 లక్షలు డిపాజిట్ చేయాలని సూచించింది. అలాగే గృహ నిర్బంధ కాలంలో మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్, ఇంటర్నెట్ లేదా మరేదైనా కమ్యునికేషన్ సాధనాన్ని వినియోగించకూడదని ఆంక్షలు విధించింది. హౌస్ అరెస్ట్ ఆర్డర్ను 48 గంటల్లోగా అమలు చేయాలని ఆదేశించింది.
కాగా, మానవ హక్కుల కార్యకర్త గౌతమ్ నవలఖాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై 2017 భీమా కోరేగావ్ హింసాత్మక కేసులో మహారాష్ట్ర పోలీసులు 2018లో ఆయనను అరెస్ట్ చేశారు. నాటి నుంచి ముంబైలోని తలోజా సెంట్రల్ జైలులో ఆయన ఉన్నారు. బెయిల్ కోసం నవలఖా చేసిన అభ్యర్థనకు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆయన ముంబై హైకోర్టును ఆశ్రయించారు.