సినిమాల్లో చూపించినట్లు జైల్లో నుంచే ఒక మోసగాడు తన కార్యకలాపాలు కొనసాగించాడు. దీనికి ఆ జైలు అధికారులు కూడా చాలా బాగా సహకరించారు. ఇలా సాయం చేసినందుకు పదిహేను రోజులకోసారి రూ.50 లక్షలు లంచాలు తీసుకున్నారు. ఇవన్నీ దేశరాజధాని ఢిల్లీలోని రోహిణీ జైల్లో వెలుగు చూసిన ఘాతుకాలు.
తీహార్ జైల్లో ఉన్న కొందరు నేరస్థులు తమ కార్యకలాపాలను యదేచ్ఛగా కొనసాగిస్తుండటంపై సుప్రీంకోర్టు కొన్ని రోజుల క్రితం అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈవోడబ్ల్యూ) రంగంలోకి దిగింది. వారి దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
సుకేష్ చంద్రశేఖర్ అనే నేరస్థుడికి జైలు అధికారులే సహాయసహకారాలు అందించినట్లు ఈవోడబ్ల్యూ అధికారులు తేల్చారు. అంతేకాదు జైల్లో నిషేధం ఉన్న మొబైల్, ఇతర వస్తువులన్నింటినీ సుకేష్ చక్కగా వాడుకునే వాడని వెల్లడించారు. ఇవేవీ సీసీకెమెరాలో రికార్డు అవకుండా ఉండేందుకు జైలు అధికారులే.. కెమెరాలకు టవల్స్, కర్టెన్లు, బాటిళ్లు అడ్డుపెట్టినట్లు ఈవోడబ్ల్యూ అధికారులు తమ చార్జ్షీట్లో తెలియజేశారు.
రెలిగేర్ సంస్థలో ప్రమోటర్గా పనిచేసిన శివీందర్ సింగ్ భార్య అదితి సింగ్ను సుకేష్ మోసం చేసి కోట్లు కాజేశాడు. ఈ కేసులో నిందితుడికి సాయం చేసినందుకు జైల్లో పనిచేసే ఐదుగురు సీనియర్ అధికారులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈవోడబ్ల్యూ చార్జ్ షీట్ ప్రకారం, ప్రతి పదిహేను రోజులకోసారి సుకేష్ సహచరులైన దీపక్, ప్రదీప్ రామ్నాని నుంచి 60-75 లక్షల రూపాయలను జైలు సూపరిండెంటెంట్ డీఎస్ మీనా వసూలు చేసేవారు. ఈ డబ్బును జైలు అధికారులంతా పంచుకునేవారు. ఆ తర్వాత జైలు నుంచి వీరి కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకాలూ రాకుండా సహకరించేవారు.