న్యూఢిల్లీ, ఆగస్టు 6: నూతన సాగు చట్టాలపై మహోత్తర పోరాటంతో మోదీ సర్కారు మెడలు వంచిన రైతు సంఘాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్పై ఉద్యమానికి సిద్ధమయ్యాయి. ఆదివారం(ఆగస్టు 7వ తేదీ) నుంచి అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు చేపట్టనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ప్రకటించింది. మాజీ సైనికాధికారుల ఐక్యవేదిక, పలు యువజన సంఘాలు ఇందులో పాల్గొంటాయని శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
ప్రచారంలో భాగంగా 7 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా పలు పట్టణాల్లో ‘జై జవాన్, జై కిసాన్’ సదస్సులు నిర్వహించనున్నట్టు స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. సాయుధ బలగాల్లోకి తమ బిడ్డలను పంపుతున్న రైతు కుటుంబాలపై అగ్నిపథ్ స్కీమ్ తీవ్ర ప్రభావం చూపుతుందని ఎస్కేఎం పేర్కొన్నది. సైన్యంలో సమర్థవంతమైన రెగ్యులర్, పర్మినెంట్ రిక్రూట్మెంట్ విధానానికి కేంద్రం ఈ కొత్త పథకం ద్వారా ముగింపు పలుకుతున్నదని విమర్శించింది. దీంతో ప్రస్తుతం మంజూరైన 14 లక్షల మంది సైనిక బలగాల పరిమాణాన్ని 7 లక్షలకు తగ్గిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.
పాత రిక్రూట్మెంట్నే కొనసాగించాలి
పంజాబ్, హర్యానా, హిమాచల్, ఉత్తరాఖండ్, పశ్చిమ యూపీ, తూర్పు రాజస్థాన్ రీజియన్ల నుంచి సైన్యంలో తరతరాలుగా గణనీయ భాగస్వామ్యం ఉన్నదని, ఇప్పుడు అగ్నిపథ్ వలన అది తీవ్రంగా తగ్గిపోతుందని ఎస్కేఎం అభిప్రాయపడింది. రెగ్యులర్ అండ్ పర్మినెంట్ రిక్రూట్మెంట్ పద్దతిలోనే ప్రస్తుతం పెండింగ్లో ఉన్న దాదాపు 1.25 లక్షల ఖాళీలతో పాటు ఈ సంవత్సరం 60 వేల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ఇప్పటికే ప్రారంభించిన నియామక ప్రక్రియలను పూర్తి చేయాలని డిమాండ్ చేసింది. గత రెండేండ్లలో ఎటువంటి నియామకాలు లేనందున అభ్యర్థులకు రెండేండ్ల వయసు సడలింపు ఇవ్వాలని ఎస్కేఎం సూచించింది. అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనకారులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని, అరస్టైన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. దేశ రక్షణ విషయంలో రాజీపడకూదని, రక్షణ రంగంలో ప్రైవేటీకరణ సరికాదని అభిప్రాయపడింది.
దేశ వెన్నెముక విరిగిపోయే ప్రమాదం..
7 నుంచి 14 వరకు నిర్వహించనున్న ‘జైజవాన్, జైకిసాన్’ సదస్సుల్లో వివాదాస్పద అగ్నిపథ్ వినాశకర పరిణామాలను వివరిస్తామని స్వరాజ్ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అగ్నిపథ్ను వెనక్కు తీసుకునేలా కేంద్రంపై శాంతియుత పద్ధతిలో ఉద్యమం చేస్తామని తెలిపారు. రైతులు, సైనికులు కష్టాల్లో ఉన్నారంటే.. దేశ వెన్నెముక విరిగిపోయే ప్రమాదంలో ఉన్నట్టేనని హెచ్చరించారు. ప్రభుత్వ వినాశకర విధానాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
రైతాంగం మద్దతుగా నిలవాలి
అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనకు రైతాంగం మద్దతివ్వాలని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ కోరారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని బాఘ్పత్ జిల్లాలో జరిగిన రైతుల సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. కొన్నేండ్లుగా కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్దయెత్తున ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రైతులను బెదిరించేందుకు పోలీసులు వారిపై పాత కేసులను తవ్వుతున్నారని మండిపడ్డారు. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నేతలపై కేసుల ఎత్తివేత ప్రారంభమైందని విమర్శించారు. ‘మీరు రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేయొచ్చు. రైతు సంఘాలను విడదీయొచ్చు. కానీ రైతులను విభజించలేరు. మీ రెండు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడుతారు’ అని స్పష్టం చేశారు. భూసేకరణ, విద్యుత్తు చార్జీలు, చెరకు బకాయిలు తదితర అంశాలపై టికాయిత్ సభలో మాట్లాడారు.