న్యూఢిల్లీ : జహంగీర్పురిలో అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం చేపట్టగా సుప్రీంకోర్టు కలుగచేసుకుని ఈ డ్రైవ్ను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు వెలువడే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రాంతంలోని గణేష్ కుమార్ గుప్తా జ్యూస్ షాపును అధికారులు జేసీబీలతో పాక్షికంగా ధ్వంసం చేశారు. 1977లో ఈ షాపును ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ తమకు కేటాయించిందని ఇందుకు ఆధారాలుగా అన్ని పత్రాలు తన వద్ద ఉన్నాయని గుప్తా పేర్కొన్నారు.
తన వద్ద అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని అధికారులకు చెప్పినా వారు వినిపించుకోకుండా నిర్మాణాలను కూల్చివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. గంట కిందటే సుప్రీంకోర్టు కూల్చివేతలను నిలిపివేయాలని ఆదేశించిందని తాను అధికారులకు తెలిపినా వారు అక్కడి షాపులను నేలమట్టం చేశారని గుప్తా చెప్పుకొచ్చారు. తన కుటుంబంలో ఎవరూ శనివారం నాటి ఘర్షణలో నిందితులుగా లేరని ఆయన తెలిపారు. తాము షాపు నడుపుకుంటున్నామని తమను ఎందుకు అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు.
అధికారుల నిర్వాకంపై న్యాయస్దానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు. కాగా, హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా శనివారం జరిగిన అల్లర్లలో నిందితులు జహంగీర్పురిలోని అక్రమ నిర్మాణాల్లో ఉంటున్నారని వాటిని కూల్చివేయాలని ఢిల్లీ బీజేపీ చీఫ్ అదేష్ గుప్తా ఆరోపించిన క్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతను చేపట్టడం గమనార్హం. జహంగీర్పురిలో జరిగిన ఘర్షణల్లో తొమ్మిది మంది గాయపడగా ఈ కేసుకు సంబంధించి 25 మందిని ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకూ అరెస్ట్ చేశారు.