బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) టికెట్ల పంపిణీ కాషాయ పార్టీలో ప్రకంపనలు రేపింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు బీజేపీ హైకమాండ్ టికెట్ నిరాకరించడంతో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగదీష్ షెట్టార్ బీజేపీకి రాజీనామా చేశారు. షెట్టార్ రాజీనామాతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
కాగా తనను పార్టీని వీడకుండా నిరోధించేందుకు హైకమాండ్ ప్రయత్నించిందని జగదీష్ షెట్టార్ చెప్పుకొచ్చారు. తనకు పార్టీ పెద్దలు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారని, ఈ ప్రతిపాదనకు తాను తిరస్కరించానని వెల్లడించారు. తాను బెంగళూర్ వెళ్లి తన రాజీనామాను పార్టీ నేతలకు అందచేస్తానని తెలిపారు. పలువురు లింగాయత్ నేతలు పార్టీని వీడటంతో ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు సన్నగిల్లాయని అన్నారు. టికెట్ల కేటాయింపులో పార్టీ అగ్రనాయకత్వం ద్వంద ప్రమాణాలు అనుసరించిందని దుయ్యబట్టారు. తాను ఏ పార్టీలో చేరాలనేదానిపై ఈరోజే ఓ నిర్ణయం తీసుకుంటానని అన్నారు.
పార్టీ టికెట్లు లభించకపోవడంతో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు బీజేపీకి రాజీనామా చేశారు. మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవది ఇటీవల బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఇక మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More