న్యూఢిల్లీ, ఆగస్టు 6: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్ విజయం సాధించారు. శనివారం జరిగిన పోలింగ్లో 780 రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు గానూ 725 మంది ఓటేశారు. వీటిలో జగదీప్ 528 ఓట్లు సాధించగా, విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించగా, సాయంత్రం 6 గంటల నుంచి అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. దేశ 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖడ్ ఈనెల 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో జగదీప్ ధన్ఖడ్కు త్వరలో పదవీ విరమణ చేయబోతున్న ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుతో పాటు ప్రధాని మోదీ, విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వా, పలు రాష్ర్టాల సీఎంలు, పలు పార్టీల నేతలు శుభాకాంక్షలు చెప్పారు.
ఓటేసిన టీఆర్ఎస్ ఎంపీలు
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా శనివారం పార్లమెంట్ ప్రాంగణంలోని పోలింగ్ బూత్లో టీఆర్ఎస్ ఎంపీలు ఓట్లు వేశారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతు ఇస్తామని టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్ రావు నేతృత్వంలో ఎంపీలు కేఆర్ సురేశ్ రెడ్డి, జోగినపల్లి సంతోష్కుమార్, దీవకొండ దామోదర్రావు, బడుగుల లింగయ్య యాదవ్, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, కొత్త ప్రభాకర్రెడ్డి, పోతుగంటి రాములు, జీ. రంజిత్రెడ్డి, మన్నె శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్నేత, మాలోత్ కవిత, పసునూరి దయాకర్, బీబీ పాటిల్ మొత్తం 16 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.