బెంగళూర్ : కర్నాటక (Karnataka Assembly Elections) ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపును ఎవరూ ఆపలేరని కాంగ్రెస్ నేత, మాజీ సీఎం జగదీష్ శెట్టార్ అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల ప్రచారం ఎన్నికల్లో తమకు లాభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి ప్రజల ఆశీస్సులు తనకున్నాయని, పెద్దసంఖ్యలో ప్రజలు తనకు మద్దతు ఇస్తున్నారని, తన గెలుపు ఖాయమని హుబ్లీ ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన శెట్టార్ పేర్కొన్నారు.
కాషాయ పార్టీకి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటు తప్పదని అన్నారు. బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన శెట్టార్ కాషాయ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. ప్రముఖ లింగాయత్ నేతలు శెట్టార్, లక్ష్మణ్ సవదిలు బీజేపీని వీడటంతో పాటు వీరశైవ లింగాయత్ సంఘం కాంగ్రెస్కు ఓటువేయాలని పిలుపు ఇవ్వడంతో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఇక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీల ప్రచారం క్లైమాక్స్కు చేరింది. అగ్రనేతలు ర్యాలీలు, రోడ్షోలు, బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More