న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజనకు చెందిన కమిటీ ఇవాళ ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. కశ్మీర్తో పాటు జమ్మూ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన నియోజకవర్గాల వివరాలను ఆ కమిటీ వెల్లడించింది. జమ్మూలో అదనంగా ఆరు, కశ్మీర్ లోయలో అదనంగా ఒక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలంటూ డీలిమిటేషన్ కమిటీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీంతో జమ్మూ ప్రాంతంలో 43, కశ్మీర్లో 47 అసెంబ్లీ స్థానాలు ఏర్పడనున్నాయి. ఇక పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో 24 సీట్లు ఖాళీగా ఉంటాయని కమిటీ ప్రతినిధులు తెలిపారు. జేకే డీలిమిటేషన్ ప్యానల్.. మొత్తం 9 సీట్లు ఎస్టీలకు, ఏడు సీట్లు ఎస్సీలకు కేటాయించింది. అయితే ఈ ప్రతిపాదనలపై సూచనలను డిసెంబర్ 31వ తేదీలోగా వెల్లడించాలని ఇతర సభ్యులను కమిటీ కోరింది.