పనాజీ: గోవాలో అధికార భారతీయ జనతాపార్టీకి షాక్ తగిలింది. గోవా సర్కారులో సీనియర్ మంత్రి మైఖేల్ లోబో తన పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని లోబోనే స్వయంగా మీడియాకు వెల్లడించారు. గోవా క్యాబినెట్లో మంత్రి పదవికి రాజీనామా చేశాను. కలాంగుటే నియోజకవర్గ ప్రజలు నా నిర్ణయాన్ని గౌరవిస్తారని భావిస్తున్నా. అదేవిధంగా ఎమ్మెల్యే పదవికి కూడా నేను రాజీనామా చేస్తా అని మైఖేల్ లోబో తెలిపారు.
అయితే, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసే విషయాన్ని మాత్రం లోబో ఇంకా వెల్లడించలేదు. తన కార్యకర్తలతో చర్చించిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ఇతర రాజకీయ పార్టీలతో తాను సంప్రతింపులు జరుపుతున్నానని తెలిపారు. పార్టీలో తమను చూస్తున్న తీరుతో నిరుత్సాహానికి గురయ్యారని, రాష్ట్ర బీజేపీ తీరుతో కార్యకర్తలు ఎవరూ సంతోషంగా లేరని ఆయన వ్యాఖ్యానించారు. మనోహర్ పారికర్ విధానాలను ప్రభుత్వం పక్కనపడేసిందని, దాంతో ఆయనను అభిమానించే కార్యకర్తలంతా బీజేపీ దూరమయ్యారని లోబో చెప్పారు.