ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తనయుడు, శివసేన నాయకుడు ఆదిత్య థాకరే సవాల్ విసిరారు. రాజ్యాంగేతర ముఖ్యమంత్రికి తనపై అసెంబ్లీ ఎన్నికల్లో తలపడే దమ్ముందా..? అని ఆయన ప్రశ్నించారు. ‘నేను నా అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తా. ఆయన తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయాలి. దమ్ముంటే ప్రస్తుతం ఖాళీగా ఉన్న వర్లీ అసెంబ్లీ స్థానంలో ఆయన నాతో పోటీపడి గెలవాలి’ అని ఆదిత్య సవాల్ చేశారు.
శివసేన పార్టీలో అగ్ర నాయకుడిగా ఉన్న షిండే 40 మంది ఎమ్మెల్యేలతో పార్టీని చీల్చి బీజేపీ పంచన చేరారు. దాంతో శివసేన నేతృత్వంలో ఏర్పాటైన మహాకూటమి ప్రభుత్వం కుప్పకూలింది. బీజేపీ మద్దతుతో ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. షిండే రాజ్యాంగ విరుద్ధంగా ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చినందున ఆదిత్య థాకరే అతడిని రాజ్యాంగేతర ముఖ్యమంత్రిగా అభివర్ణించారు.