న్యూఢిల్లీ, జనవరి 28: గతేడాది యావత్ దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అసలు నిజాలు దాచిందా? స్పైవేర్ కొనుగోలు, వాడకం విషయంలో రక్షణ శాఖ ఇచ్చిన వివరణ శుద్ధ అబద్ధమా? కేంద్రమంత్రులు, విపక్ష నేతలు, జర్నలిస్టులు ఇలా వివిధ రంగాలకు చెందిన 300 మందికి పైగా ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్ విషయాన్ని తప్పుదోవ పట్టించడానికి మోదీ సర్కారు కుట్రకు పాల్పడిందా? అంతర్జాతీయ పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’లో ప్రచురితమైన తాజా కథనాన్ని విశ్లేషిస్తే ఇవన్నీ నిజమేననిపిస్తున్నది.
చెప్పిన మాటలన్నీ అబద్ధాలే!
ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ రూపొందించిన పెగాసస్ స్పైవేర్ సాయంతో దేశంలోని పలువురి ఫోన్లను హ్యాక్ చేసినట్టు తెలియడంతో గతేడాది జూలైలో పెద్దఎత్తున వివాదం రేగింది. ఇదే అంశం పార్లమెంటును కుదిపేసింది. దీనిపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే పెగాసస్ కొనుగోలు, వాడకంపై కేంద్రం దాటవేత ధోరణిని ప్రదర్శించింది. దీంతో విపక్షాలు తమ నిరసనలను ఉద్ధృతం చేశాయి. సమాధానం చెప్పాల్సిందేనని పట్టుబట్టాయి. ఈ క్రమంలో రక్షణమంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎన్ఎస్వో గ్రూపుతో తమకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరుగలేదని స్పష్టం చేసింది. అయితే, ఇది పూర్తిగా అవాస్తవమని న్యూయార్క్ టైమ్స్ తాజా రిపోర్టు తేల్చి చెప్పింది. 2017లో భారత్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన రూ. 15 వేల కోట్ల (2 బిలియన్ డాలర్లు) భారీ ఒప్పందంలో భాగంగానే కేంద్రంలోని మోదీ సర్కారు పెగాసస్ స్పైవేర్ను కొనుగోలు చేసిందని స్పష్టం చేసింది.
కొనుగోలు ఎలా జరిగిందంటే..
ఇండియన్ ఆర్మీకి ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ సరఫరా చేసేందుకు భారత ప్రభుత్వానికి చెందిన ఓ విభాగం (లేదా ఏజెన్సీ) ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్తో 2017లో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. దీని విలువ రూ. 15 వేల కోట్లు. ఆ ఏడాది ఏప్రిల్లో పూర్తయిన ఈ డీల్లో భాగంగా క్షిపణులతో పాటు ఎన్ఎస్వో గ్రూప్ రూపొందించిన పెగాసస్ స్పైవేర్ను కూడా భారత్ కోరిక మేరకు అందజేయడానికి ఇజ్రాయెల్ ఒప్పుకొన్నది. అధునాతన ఆయుధాలు, సాంకేతికత మార్పిడిలో భాగంగా ఇజ్రాయెల్తో భారత్ రూ. 15 వేల కోట్ల ఒప్పందం చేసుకొన్నట్టు ఈ డీల్ గురించి అప్పటి కేంద్ర సర్కారు చెప్పింది. అయితే, క్షిపణులతో పాటు పెగాసస్ కూడా ఈ డీల్లో భాగంగా మోదీ సర్కారు కొనుగోలు చేసినట్టు తాజాగా వెల్లడైంది.
విచారణకు ఇప్పటికే సుప్రీంకోర్టు కమిటీ
పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. పెగాసస్ వియోగించారా లేదా అన్నది దేశ భద్రతతో ముడిపడిన అంశమని, దీనిని బహిర్గతం చేయలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే దేశ భద్రత సాకుతో హక్కులు కాలరాస్తే ప్రేక్షకుడిలా ఉండలేమని కోర్టు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. నిజాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్ నేతృత్వంలో కమిటీని నియమించింది.
హంగేరీ సర్కారుపై జర్నలిస్టుల దావా
హంగేరీలోని పలువురు జర్నలిస్టులు, పౌరహక్కుల కార్యకర్తల ఫోన్లు పెగాసస్ స్పైవేర్ హ్యాకింగ్ బారిన పడ్డాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వాళ్లు అక్కడి ప్రభుత్వంతో పాటు పెగాసస్ను రూపొందించిన ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్వోపై దావా వేశారు. హ్యాకింగ్ వ్యవహారంలో ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేస్తూ కేసు వేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి.