చండీగఢ్: హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) కాంగ్రెస్తోపాటు ప్రతిపక్షాలపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది బీజేపీ యుగమన్న ఆయన అందరూ సర్దుకుని కూర్చోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ బుధవారం అంబాలాలోని గురుద్వారా లఖ్నౌర్ సాహిబ్లో ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలపై ఆయన మండిపడ్డారు. ప్రజలంతా బీజేపీతో ఉన్నారని, ప్రతి ఒక్కరూ సర్దుకుని కూర్చోవాలని వ్యాఖ్యానించారు. ‘వారికి (కాంగ్రెస్) ఏమీ లేదు. ప్రస్తుతం ప్రతి రోజు, ప్రతి సంవత్సరం బీజేపీకి చెందింది. ఇది బీజేపీ యుగం. కాబట్టి బీజేపీ యుగంలో, అందరూ సర్దుకుని కూర్చోవాలి (సబ్ లోగ్ బిస్తర్ గోల్ కర్కే బైఠ్ జాయే). ఎందుకంటే ప్రజలు బీజేపీ వెంటే ఉన్నారు’ అని ఖట్టర్ అన్నారు.
కాగా, జనవరి 22న అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహాల ప్రాణప్రతిష్టాపన బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమమని కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. దీంతో ఆ కార్యక్రమానికి హాజరుకాబోమని ఆ పార్టీలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలను ఈ మేరకు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం బీజేపీ యుగమన్న ఆయన అందరూ సర్దుకుని కూర్చోవాల్సిందేనని వ్యాఖ్యానించారు.