చండీఘడ్: ఆమ్ ఆద్మీ ఊడ్చేసింది. పంజాబ్లో వన్మ్యాన్ షో ప్రదర్శించింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆ పార్టీ సంచలనం నమోదు చేసింది. తాజా రిపోర్ట్ ప్రకారం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్లో.. 89 స్థానాల్లో ఆప్ లీడింగ్లో ఉంది. కేజ్రీవాల్ ఇచ్చిన వాగ్ధానాలు పంజాబీలను అట్రాక్ట్ చేసింది. దీంతో ఆ రాష్ట్ర ప్రజలు ఏకపక్షంగా ఆమ్ ఆద్మీకి ఓటేసినట్లు కనిపిస్తోంది.
పంజాబ్ సీఎం చన్నీ, సిద్దూ ఓట్ల లెక్కింపులో వెనుకంజలో ఉన్నారు. అయితే పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో గత రెండేళ్ల నుంచి జరుగుతన్న పరిణామాలను ఆ పార్టీని కుదేలు చేసేశాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్కు పంజాబ్లో అతి ఘోరమైన ఓటమి ఎదురుకానున్నది. మాజీ సీఎం అమరీందర్, సిద్దూ మధ్య జరిగిన ఆధిపత్య పోరు ఆ పార్టీని నిలువునా ముంచేసింది.
ఎన్నికలకు ముందే అమరీందర్ కాంగ్రెస్ను వీడి కొత్త పార్టీ పెట్టి బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే బీజేపీ, అమరీందర్ కూటమి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. రైతుల ఆందోళనలు బీజేపీకి పంజాబ్లో మైనస్ అయ్యాయి.
తాజా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ సింగ్ పోటీ చేశారు. దురి నియోజకవర్గం నుంచి ఆయన ఆధిక్యంలో ఉన్నారు. రెండు స్థానాల నుంచి పోటీ చేసిన సీఎం చన్నీ.. ఓ స్థానం నుంచి వెనుకంజలో ఉన్నారు. ఆప్ క్లీన్ స్వీప్ దిశగా వెళ్తోంది. 89 స్థానాల్లో ఆప్, 15 స్థానాల్లో కాంగ్రెస్, శిరోమనీ అకాలీదళ్ 8 స్థానాల్లో, బీజేపీ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
కేజ్రీవాల్ తరహా పాలనను దేశ ప్రజలు కోరుకుంటున్నట్లు ఆ పార్టీ నేత రాఘవ్ చడ్డా తెలిపారు. కాంగ్రెస్కు ఆమ్ ఆద్మీ ప్రత్యామ్నాయంగా మారినట్లు ఆయన చెప్పారు. నౌకరీల కోసం పంజాబీ యువత ఎంతో కాలం వేచి చూసిందన్నారు.