చెన్నై, మే 26: తమిళనాడులో డీఎంకే పార్టీ నేత, మంత్రి సెంథిల్ బాలాజీని లక్ష్యంగా చేసుకొని శుక్రవారం ఐటీ దాడులు జరిగాయి. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే దాడులు జరిగాయని డీఎంకే పేర్కొంది. టాస్మాక్ అవుట్లెట్లలో అవకతవకలు జరిగాయని ఏఐఏడీఎంకే, బీజేపీ గవర్నర్కు ఫిర్యాదు చేసిన అనంతరం ఈ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకున్నది. మంత్రి సోదరుడి ఇంట్లో తనిఖీలు చేసేందుకు వచ్చిన అధికారులను డీఎంకే కార్యకర్తలు అడ్డుకున్నారు.
అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ కారు అద్దాలను ధ్వంసం చేశారు. మంత్రి సంబంధీకుల ఇండ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కరూర్, ఈరోడ్, కోయంబత్తూర్ తదితర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు తనిఖీలు జరిగాయి. సమాచారం అందుకున్న డీఎంకే కార్యకర్తలు కరూర్లోని మంత్రి సోదరుడు అశోక్ ఇంటికి చేరుకొని అధికారులను అడ్డగించారు. కారు అద్దాలను పగలగొట్టారు. డీఎంకే నేత, మాజీ ఎంపీ భారతి దాడులను ఖండించారు.