Ashwini Vaishnaw | ముస్లిం మహిళలను అమ్మే యాప్లపై అతి త్వరలోనే చర్యలు తీసుకుంటామని కేంద్ర ఐటీ మంత్రి అశ్వనీ వైష్ణవ్ హామీ ఇచ్చారు. బుల్లిబాయ్ పేరుతో గతంలో ముస్లిం మహిళలను అమ్మే యాప్ వచ్చింది. దీనిపై పెద్ద వివాదమే రేగింది. దీనికి సమాంతరంగా తాజాగా సుల్లీడీల్స్ పేరుతో మరో యాప్ కూడా వచ్చింది. ఈ విషయాన్ని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదీ కేంద్ర ఐటీ మంత్రి అశ్వనీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ యాప్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
‘సుల్లీ డీల్స్ వంటి యాప్లను క్రియేట్ చేసి, ఓ వర్గం మహిళలను టార్గెట్ చేస్తూ, కించపరుస్తున్న యాప్లపై చర్యలు తీసుకోవాలని పదే పదే నేను కేంద్ర మంత్రిని డిమాండ్ చేస్తూనే వున్నాను. అయినా ఆయన పట్టించుకోకపోవడం అత్యంత హేయం.’ అంటూ ప్రియాంక చతుర్వేది ట్విట్టర్ వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. అయితే దీనిపై కేంద్ర ఐటీ మంత్రి అశ్వనీ వైష్ణవ్ స్పందించారు. ఈ యాప్ తయారుచేసిన యూజర్ను గిట్హబ్ బ్లాక్ చేసిందని ట్వీట్ చేశారు. అలాగే తదుపరి చర్యల నిమిత్తం సీఈఆర్టీ మరియు పోలీసు విభాగం వారు సంయుక్తంగా పనిచేస్తున్నారని అశ్వనీ వైష్ణవ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా స్పందించారు. అందరూ కలిసి కట్టుగా ఉంటేనే ఇలాంటి వాటిని నిరోధించగలమని ట్వీట్ చేశారు. ‘మహిళలపై వివక్ష, మత ద్వేషం… వీటికి వ్యతిరేకంగా అందరూ కలిసి కట్టుగా పోరాడినప్పుడే నిరోధించగలం. సంవత్సరం మారింది.. పరిస్థితిని కూడా మార్చాలి’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.