న్యూఢిల్లీ, మే 13: కరోనా రెండో దశ ఉద్ధృతితో దేశం పోరాడుతున్న వేళ.. మహమ్మారి మళ్లీ పంజా విసురుతుందని కేంద్రం హెచ్చరించింది. ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ర్టాలతో కలిసి జాతీయస్థాయిలో ఏర్పాట్లు చేయవలసి ఉందని తెలిపింది. మౌలిక సదుపాయాలను పెంచి, ఆంక్షలను కొనసాగించాలని సూచించింది. ఈ మేరకు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా రెండో దశ ఉద్ధృతి గురించి కేంద్రానికి తెలియదన్న ఆరోపణలను ఖండించారు. రెండో దశ వస్తుందని తాము పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నామని చెప్పారు. ‘సెరో పాజిటివిటీ రేట్ 20 శాతం ఉంది. 80 శాతం జనాభాకు కరోనా ముప్పు ఉంది. కరోనా ఎక్కడికీ వెళ్లిపోలేదు. ఇతర దేశాల్లోనూ మళ్లీ ప్రబలింద’ని చెప్పినట్టు పేర్కొన్నారు. మార్చి 17న విలేకరుల సమావేశంలో రెండో దశ వస్తుందని, మనం పోరాడాల్సి ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారని, అయితే ఆయన ప్రజలను భయభ్రాంతులను చేయలేదని పాల్ చెప్పారు. అయితే ఎంత పీక్కు వెళుతుందనే పరిమాణాన్ని ఏ నమూనా ముందే చెప్పలేదని, దీనికి కరోనా అనూహ్య ప్రవర్తనే కారణమన్నారు. దేశంలో మూడు రోజులుగా పాజిటివిటీ రేట్ స్వల్పంగా తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.
కోలుకుంటున్న ఢిల్లీ
కరోనా సెకండ్ వేవ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడిన ఢిల్లీ క్రమంగా కోలుకుంటున్నది.నిన్నటిదాకా కరోనా రోగులకు కనీసం బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లూ దొరకని పరిస్థితి నుంచి మిగులు బెడ్లు ఉండే స్థితికి చేరుకుంటున్నది. ఢిల్లీలోని దవాఖానల్లో బుధవారం అందుబాటులో ఉన్న పడకలు, ఐసీయూ బెడ్లను పరిశీలిస్తే దాదాపు 4 వేలకుపైగా బెడ్లు ఖాళీగా ఉన్నాయి. 98 ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. రోజువారీ కరోనా కేసులు తగ్గుతుండటంతో పాజిటివిటీ రేటు 14 శాతానికి దిగివచ్చింది. మెడికల్ ఆక్సిజన్ అవసరం కూడా తగ్గింది. ఇంతకుముందు ప్రతిరోజు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం కాగా.. ప్రస్తుతం అది 582 మెట్రిక్ టన్నులకు పడిపోయింది. దీంతో మిగులు ఆక్సిజన్ను అవసరమున్న ఇతర రాష్ర్టాలకు పంపాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.
మహారాష్ట్ర, బీహార్లలో లాక్డౌన్ పొడిగింపు
మహారాష్ట్రలో విధించిన లాక్డౌన్ తరహా ఆంక్షలను జూన్ 1 వరకు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బయటి వ్యక్తులు ఎవరైనా రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి తెలిపింది. దీనితోపాటు గతంలో విధించిన ఆంక్షలన్నీ అమల్లో ఉంటాయని వివరించింది. మరోవైపు బీహార్లో లాక్డౌన్ను ఈ నెల 25 వరకు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ గురువారం తెలిపారు.