ముంబై, అక్టోబర్ 27: పెండ్లయిన మహిళను కుటుంబం కోసం పని చేయాలనడం పనిమనిషితో సమానంగా చూడటం కాదని, అది క్రూరత్వం కిందకు రాదని బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. భర్తపై, అత్తామామలపై ఓ మహిళ దాఖలు చేసిన గృహహింస కేసును కొట్టివేసింది. నిందితులపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కూడా కొట్టివేసింది. పెండ్లయిన నెలరోజుల వరకు బాగానే చూసుకొన్నారని, ఆ తర్వాత తనను పనిమనిషిలా చూడటం మొదలుపెట్టారని ఆ మహిళ తన ఫిర్యాదులో ఆరోపించింది. న్యాయమూర్తులు విభా కంకణ్వాడీ, రాజేశ్ పాటిల్తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
తనను వేధిస్తున్నారని పలు ఆరోపణలు చేసిన మహిళ స్పష్టంగా ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయిందని ధర్మాసనం అభిప్రాయపడింది. కుటుంబం కోసం పనిచేయమనడం పనిమనిషిలా చూడటం ఎలా అవుతుందని ప్రశ్నించింది. ఒకవేళ ఇంటిపని చేయడం ఇష్టం లేకపోతే సదరు మహిళ పెండ్లికి ముందే ఆ సంగతి చెప్పి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. మానసికంగా, శారీరకంగా వేధించారని అంటే 498ఏ కేసు పెట్టేందుకు సరిపోదని స్పష్టం చేసింది.