(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ)/న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్పై విపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించిన(ఈనెల 26న) తర్వాత ప్రభుత్వం లోక్సభలో మూడు రోజుల్లో ఆరు బిల్లులను ఆమోదించుకొన్నది. అది కూడా ఎటువంటి చర్చ లేకుండా. ఇందులో కీలకమైన అటవీ సంరక్షణ సవరణ బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు వంటివి ఉన్నాయి. ఓవైపు అవిశ్వాస తీర్మానంపై చర్చ పెండింగ్లో ఉండగా.. ఈ విధంగా ప్రభుత్వం బిల్లులను హడావుడిగా ఆమోదించుకోవడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇది పార్లమెంట్ నిబంధనలు, సంప్రదాయాలకు విరుద్ధమని తప్పుబట్టాయి.
ఎలాంటి బిల్లులను తీసుకురాకూడదు!
అవిశ్వాస తీర్మానం తర్వాత బిల్లుల ఆమోదానికి సంబంధించి 1996, జూలై 26న అప్పటి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి సత్యేంద్ర నారాయణ్ సిన్హా చేసిన ప్రకటనను కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ ట్విట్టర్లో ప్రస్తావించారు. ‘ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు, ఇతర ముఖ్యమైన బిల్లులు, తీర్మానాలను తీసుకురాకూడదనే దానికి నేను అంగీకరిస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారని, నారాయణ్ సిన్హా చేసిన వ్యాఖ్యలను చదువుకోవాలంటూ ప్రస్తుత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిని తన పోస్టులో ట్యాగ్ చేశారు. ‘కౌల్ అండ్ షఖ్దర్, పార్లమెంట్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ బుక్లోని పేజీ 772లో ఈ విషయం స్పష్టంగా ఉన్నది. అవిశ్వాస తీర్మానంపై చర్చ తేలేవరకు పార్లమెంట్ ముందు ఎటువంటి ముఖ్యమైన పాలసీ విషయాలను తీసుకురాకూడదని చెప్తున్నది’ అని పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానం పెండింగ్లో ఉన్నప్పుడు బిల్లులను ఆమోదించడం హాస్యాస్పదమని విమర్శించారు. పార్లమెంట్ నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానంపై తేలేవరకు ఎటువంటి శాసనపరమైన వ్యవహారాలు చేపట్టకూడదని రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ అన్నారు.
బిల్లుల ఆమోదంలో తప్పులేదని స్పీకర్ సమర్ధన
అవిశ్వాస తీర్మానానికి అనుమతి, చర్చ ప్రారంభం మధ్య బిల్లులను ఆమోదించుకోవడంలో ఎటువంటి నిషేధం లేదని, తప్పేమీ లేదని ఈనెల 26న స్పీకర్ చైర్లో కూర్చొన్న రాజేంద్ర అగర్వాల్ పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానానికి, బిల్లుల ఆమోదానికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. దీన్ని విపక్ష ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. రూల్స్ను ప్రస్తావిస్తూ అటవీ బిల్లు ఆమోదంపై ఆరెస్పీ ఎంపీ ఎన్కే ప్రేమ్చంద్రన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విపక్షాల అభ్యంతరాలను తోసిపుచ్చుతూ, అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే వరకు సభా సమయాన్ని వినియోగించుకొని, ప్రజాప్రాముఖ్యత గల బిల్లులను ఆమోదించడంలో తప్పు లేదని స్పీకర్ పేర్కొన్నారు.