ముంబై: ప్రతిపక్ష నేతలపై ఒత్తిడి పెంచడానికి ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ బాగా ఉపయోగిస్తున్నదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్పవార్ ఆరోపించారు. ఈడీని గతంలో ఎప్పుడూ ఇంతలా ఉపయోగించలేదని, ప్రస్తుత మోదీ ప్రభుత్వం చీటికీమాటికీ ఈడీని ముందుకు తీసుకొస్తున్నదని ఆయన విమర్శించారు. మహారాష్ట్ర ప్రభుత్వం కొవిడ్పై సరిగా స్పందించడం లేదంటూ బీజేపీ నిరసన ప్రదర్శనలు చేపట్టడాన్ని పవార్ తప్పుపట్టారు. కొవిడ్ నిబంధనలను కేవలం ప్రతిపక్షాలకే పరిమితం చేయవద్దని, బీజేపీ నేతలు కూడా పాటించాలని చురకవేశారు.
”కేవలం మహారాష్ట్రలోనే కాకుండా మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్, తమిళనాడు ఇలా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తరుచూ ఈడీ దాడులు జరుగుతున్నాయి. గతంలో కూడా ఈడీ రైడ్స్ జరిగేవి కానీ మరీ ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ జరగలేదు. ప్రతిపక్ష పార్టీల నేతలపై ఒత్తిడి పెంచేందుకు మాత్రమే ప్రభుత్వ దర్యాప్తు సంస్థల్ని ఉపయోగిస్తున్నారు” అని మోదీ ప్రభుత్వంపై పవార్ మండిపడ్డారు.
ఇక మహారాష్ట్రలో కొవిడ్ పరిస్థితిపై బీజేపీ నిరసనలు వ్యక్తంచేయడంపైనా ఆయన స్పందిస్తూ ”కొవిడ్పై తగిన చర్యలు తీసుకొమ్మని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఆ పనిలోనే నిమగ్నమై ఉన్నారు. అయితే కొంత మంది అకారణంగా నిరసనకు దిగుతున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కు అందరికీ ఉంటుంది. కాకపోతే, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను వాళ్ల సొంత పార్టీ నేతలే పాటించడం లేదు” అని శరద్ పవార్ వ్యాఖ్యానించారు.