హైదరాబాద్: నగరానికి చెందిన హెటిరో ఫార్మసీ సంస్థపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 6వ తేదీన హెటిరో సంస్థకు చెందిన 50 ప్రాంతాల్లో ఐటీశాఖ సోదాలు జరిగాయి. మొత్తం ఆరు రాష్ట్రాల్లో జరిగిన తనిఖీల్లో.. సుమారు రూ.142 కోట్ల క్యాష్ను సీజ్ చేసినట్లు ఇవాళ సీబీడీటీ పేర్కొన్నది. ఇక లెక్కకు రాని ఆదాయం సుమారు రూ.550 కోట్లు ఉంటుందని సీబీడీటీ తెలిపింది.
సోదాల సమయంలో అనేక బ్యాంక్ లాకర్లు ఉన్నట్లు గుర్తించామని, 16 లాకర్లు ఆపరేట్ చేస్తున్నట్లు ఐటీ శాఖ చెప్పింది. ఆ సోదాల్లో రూ.142 కోట్లకు పైగా నగదు లభ్యమైందని అధికారులు తెలిపారు. ఇక లెక్క చూపని ఆదాయం సుమారు 550 కోట్లు ఉంటుందని సీబీడీటీ తన ప్రకటనలో స్పష్టం చేసింది. హెటిరో సంస్థపై మరింత లోతుగా దర్యాప్తు సాగుతున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. కోవిడ్ చికిత్సకు అవసరమైన రెమిడిసివిర్, ఫావిపిరావిర్ లాంటి ఔషధాలను హెటిరో సంస్థ ఉత్పత్తి చేసింది. ఇండియా, చైనా, రష్యా, ఈజిప్ట్, మెక్సికో, ఇరాన్ దేశాల్లో ఆ కంపెనీ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి.