(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ‘సార్, మీకు క్రెడిట్ కార్డు ఆఫర్ ఉంది? ఎలాంటి ఛార్జీలు లేవు’, ‘మేడమ్.. కార్డు తీసుకొంటే ఎన్నో ఆఫర్లు ఉన్నాయ్’.. పొద్దున లేచింది మొదలు.. రాత్రిపడుకొనే వరకూ ఇలాంటివి రోజుకు కనీసం రెండు మూడు ఫోన్ కాల్స్ రావడం నేటిరోజుల్లో సర్వసాధారణంగా మారింది.
పదేండ్ల కిందట క్రెడిట్ కార్డు కావాలంటే బ్యాంకులు పెట్టే సవాలక్ష నిబంధనలను సంతృప్తిపర్చాల్సిందే. అయితే, ద్రవ్య వినిమయం, ఎక్కువ వడ్డీ వస్తుందన్న కారణంతో క్రెడిట్ కార్డ్స్ జారీకి అనుసరించాల్సిన రూల్స్ని బ్యాంకులు, అర్థిక సంస్థలు ప్రస్తుతం సరళతరం చేశాయి. అసలు కస్టమర్ డబ్బును తిరిగి చెల్లిస్తాడో లేదో అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఇబ్బడిముబ్బడిగా క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నారు.
దీంతో క్రెడిట్ కార్డుదారుల డిఫాల్ట్స్ (90 రోజులైనా తిరిగి రుణాలను చెల్లించనివారు) కేసులు అంతకంతకూ పెరుగుతున్నట్టు ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో సంక్షోభానికి దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు. క్రెడిట్ డిఫాల్ట్స్ పెరుగుతుండటంతో తమ డబ్బును కూడా బ్యాంకులు తిరిగి చెల్లిస్తాయో లేదోనన్న ఆందోళనతో డిపాజిటర్లు ఉన్నారు.