ISRO | హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన కృష్ణ బిలాల (బ్లాక్హోల్) అధ్యయనమే లక్ష్యంగా అత్యాధునిక ఎక్స్పోశాట్ ఉపగ్రహాన్ని జనవరి 1న ఉదయం 9:10 గంటలకు ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి పంపనున్నది. ఇస్రోకు అత్యంత నమ్మకమైన పీఎస్ఎల్వీ సిరీస్లో సీ58 రాకెట్.. ఎక్స్పోశాట్తోపాటు మరో పది ఉపగ్రహాలను నింగిలోకి మోసుకుపోనున్నది. ఈ ప్రయోగానికి 24 గంటల కౌంట్డౌన్ ఆదివారం ఉదయం 8:10 గంటలకు ప్రారంభమైంది. ఇస్రో శాస్త్రవేత్తలు అమిత్కుమార్ పాత్ర, విక్టర్ జోసెఫ్, యశోద, శ్రీనివాస్ తదితరులు ఆదివారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించి ప్రయోగం నిర్విఘ్నంగా కొనసాగాలని ప్రార్థించారు.
అంతరిక్షం అంతు చూసేలా..
ఖగోళ శాస్త్రంలో సరికొత్త చరిత్రకు ఇస్రో నాంది పలుకబోతున్నది. ఇది భారత్ తొలి పొలారిమెట్రీ మిషన్ కాగా.. ప్రపంచంలో రెండోది. ఇంతకు ముందు ఈ తరహా మిషన్ అమెరికా చేపట్టింది. సవాళ్లతో కూడుకున్న పల్సర్లు, బ్లాక్హోల్ ఎక్స్ రే బైనరీలు, యాక్టివ్ గెలాక్సీ న్యూక్లియోలు, న్యూట్రాన్ స్టార్స్, నాన్ థర్మల్ సూపర్ నోవా అవశేషాలతో సహా విశ్వంలో గుర్తించబడిన 50 ప్రకాశవంతమైన మూలాలను ఎక్స్పోశాట్ అధ్యయనం చేయనున్నది. ఈ ఉపగ్రహాన్ని 500-700 కిలోమీటర్ల దూరంలో వృత్తాకార దిగువ భూ కక్ష్యలో ప్రవేశపెడుతారు. ఐదేండ్లపాటు సేవలందించనున్న ఎక్స్పోశాట్లో రెండు పేలోడ్స్ ఉన్నాయి. పాలీఎక్స్ (ఎక్స్-కిరణాలలో పొలారిమీటర్ పరికరం), ఎక్స్-రే స్పెక్ట్రోసోపీ, టైమింగ్ (ఎక్స్పెక్ట్-ఎక్స్స్పీఈసీటీ)ను అమర్చారు. పాలీఎక్స్ను రామన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ తయారు చేయగా, ఎక్స్పెక్ట్ను యూఆర్ రావు శాటిలైట్ సెంటర్కు చెందిన స్పేస్ ఆస్ట్రానమీ గ్రూప్ రూపొందించింది. ఖగోళ వస్తువులు, తోకచుకుల నుంచి సుదూర గెలాక్సీల వరకు సమాచారాన్ని ఎక్స్పోశాట్ సేకరించనున్నది.