Chandrayaan-3 | బెంగళూరు, సెప్టెంబర్ 4: జాబిల్లిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు తమ కర్తవ్యాలను నిర్విఘ్నంగా పూర్తి చేశాయి. 14 రోజుల పాటు చంద్రుడిపై అధ్యయనం చేసిన ల్యాండర్, రోవర్లు స్లీప్ మోడ్లోకి వెళ్లిపోయాయి. జాబిల్లిపై పగలు ముగియనుండటంతో వాటిని ఇస్రో నిద్రాణ స్థితిలోకి పంపించింది. వాటిలోని పరికరాలను ఆఫ్ చేసింది. అయితే సిగ్నల్ రిసీవర్లు మాత్రం ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నాయని ఇస్రో తెలిపింది. ఈనెల 22న మరోసారి చంద్రుడిపై పగలు అయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో ఈ రెండింటిని మరోసారి యాక్టివేట్ చేసి పరిశోధనలను కొనసాగించాలని ఇస్రో భావిస్తున్నది. జాబిల్లిపై రాత్రి సమయంలో ఉండే ప్రతికూల పరిస్థితులను తట్టుకొని అవి తిరిగి పని చేస్తాయని ఇస్రో ఆశిస్తున్నది.
మరోవైపు విక్రమ్ ల్యాండర్ మరోసారి జాబిల్లి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇస్రో శాస్త్రవేత్తలు హాప్ ఎక్స్పరిమెంట్ పేరిట తొలుత ల్యాండర్ను మరోచోట సాఫ్ట్ల్యాండ్ చేశారు. ఇస్రో ఇచ్చిన కమాండ్లతో విక్రమ్ తన ఇంజిన్లను మండించుకున్నది. 40 సెంటీమీటర్లు పైకి ఎగిరి మొదట దిగిన శివశక్తి పాయింట్ నుంచి సుమారు 30-40 సెంటీమీటర్లు దూరంలో తిరిగి సురక్షితంగా ల్యాండ్ అయింది. అనంతరం అక్కడ కూడా విక్రమ్ పేలోడ్లతో విజయవంతంగా పరిశోధనలు చేశారు. ఈ ప్రాంతం రోవర్ నిద్రాణస్థితిలోకి వెళ్లిన ప్రదేశానికి పక్కనే ఉండటం గమనార్హం. భవిష్యత్తులో మానవసహిత యాత్రలు చేసినప్పుడు జాబిల్లి దిగి తిరిగి సురక్షితంగా భూమిపైకి వచ్చేందుకు ఈ హాప్ ప్రయోగం ఉపయోగపడుతుందని ఇస్రో వెల్లడించింది.