ISRO | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరోసారి చరిత్ర సృష్టించేందుకు రెడీ అయ్యింది. భానుడి రహస్యాలను ఛేదించేందుకు సిద్ధమైంది. గతంలో ఆదిత్య ఎల్-1 మిషన్ను చేపట్టిన ఇస్రో తాజాగా.. ప్రోబా-3 మిషన్ ప్రయోగించబోతున్నది. వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రయోగంలో భాగస్వాములయ్యారు. మిషన్ ప్రయోగం బాధ్యతలను ఇస్రో తీసుకుంటుండగా.. శాటిలైట్ను నింగిలోకి ఇస్రో విజయవంతమైన రాకెట్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (PSLV) తీసుకెళ్లనున్నది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) ప్రోబా-3 మిషన్ను డిసెంబర్ 4న ఏపీలోని శ్రీహరికోట స్పేస్పోర్ట్ నుంచి ప్రయోగించనున్నట్లు ఇస్రో వెల్లడించింది.
ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) సహకారంతో ప్రోబా-3ని ప్రయోగించబోతున్నారు. బుధవారం సాయంత్రం 4:08 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనున్నది. మిషన్లో భాగంగా 550 కిలోల బరువున్న ఉపగ్రహాలను ప్రత్యేకమైన దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉంచనున్నట్లు ఇస్రో పేర్కొంది. ఇది సంక్లిష్ట కక్ష్యలోకి ఖచ్చితత్వంతో ప్రయోగం నిర్వహించేందుకు విశ్వసనీయతను పీఎస్ఎల్వీ బలోపేతం చేస్తుందని పేర్కొంది. మిషన్లో భాగంగా యూరోపియన్ ఏజెన్సీ సూర్యుడి వాతావరణంలోని బయటి, అత్యంత వేడిపొర అయిన సోలార్ కరోనాను అధ్యయనం చేయనున్నది. ప్రోబా-3 మిషన్లో ప్రయోగించిన ఉపగ్రహాలు కృత్రిమ సూర్యగ్రహణ పరిస్థితులను సృష్టిస్తాయి.
తద్వారా సూర్యుడి బయటి పొర అంటే.. కరోనాను అధ్యయనం చేస్తాయి. ఈ జంట ఉపగ్రహాల్లో ఒక దాంట్లో కరోనాగ్రాఫ్ ఉంటుంది. మరొకటి ఆల్టరర్ కలిగి ఉంటుంది. ఈ ఉపగ్రహాలలో ఒకటి సూర్యుడిని కనిపించకుండా కృత్రిమ గ్రహణం పరిస్థితి సృష్టిస్తే.. మరొకటి కరోనాను నిశితంగా గమనిస్తూ వస్తుంది. ప్రోబా-3 మిషన్ స్పెయిన్, పోలాండ్, బెల్జియం, ఇటలీ, స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తల కృషి ఫలితం. మిషన్లో రెండు ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించబోతున్నారు. ఈ రెండేళ్ల సుదీర్ఘ మిషన్ ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి చేరుకోవడం కీలకం. ఎందుకంటే ఒకదాటితో మరొకటి సమన్వయం చేసుకుంటూ కరోనాపై అధ్యయనం చేస్తాయి. ఇందులో ఏ ఒక్కటి పని చేయకపోయినా రెండో శాటిలైట్కు ఉపయోగం లేకుండాపోతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.