ISRO | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: చంద్రయాన్-3 మిషన్కు సంబంధించి ఆసక్తికర విషయాల్ని పంచుకుంటున్న ఇస్రో, తాజాగా చంద్రుడి ఉపరితలం త్రీడీ అనాగ్లిఫ్ ఫొటోల్ని విడుదల చేసింది. మల్టీ వ్యూ ఇమేజ్లను ఒకచోట చేర్చి మూడు కోణాల్లో(త్రీడైమెన్షన్) కనిపించేలా చేయటమే ‘అనాగ్లిఫ్’. విక్రమ్ ల్యాండర్ ఉన్న ప్రాంతంలో చంద్రుడి ఉపరితలం ఎలా ఉందో త్రీడీ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రజ్ఞాన్ రోవర్కు అమర్చిన నేవిగేషన్ కెమెరాలతో తీసిన ఫొటోలను ప్రత్యేక పద్ధతిలో క్రోడీకరించి ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ఎక్స్(ట్విట్టర్)లో ఇస్రో సందేశాన్ని పోస్ట్ చేసింది. ఎరుపు, సియాన్ రంగు కళ్లద్దాలను వాడితే త్రీడీ ఇమేజ్లను మరింత స్పష్టంగా చూడగలమని ఇస్రో పేర్కొన్నది. సోమవారం ఉదయం విక్రమ్ ల్యాండర్ నిద్రావస్థలోకి వెళ్లిన తర్వాత త్రీడీ చిత్రాలను ఇస్రో విడుదల చేయటం గమనార్హం. చంద్రయాన్-3కి అమర్చిన పేలోడ్లు సేకరించిన సమాచారం మొత్తం భూమిపైకి చేరిందని, ప్రస్తుతం అక్కడ రాత్రి కావటం వల్ల పేలోడ్లను ఆఫ్ చేశామని తెలిపింది.