Joshimath | ఉత్తరాఖండ్లోని ప్రఖ్యాత టూరిస్టు ప్రాంతం జోషీమఠ్ కుంగిపోతున్న విషయం తెలిసిందే. పట్టణంలోని పలు ప్రాంతాల్లో భూమి కోతకు గురికావడం, పగుళ్లతో భయానక పరిస్థితి నెలకొంది. పట్టణంలో మొత్తంగా దాదాపు 4,500 భవనాలు ఉండగా ఇప్పటివరకు 723భవనాలకు పగుళ్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే, పట్టణంపై భారత అంతరిక్ష సంస్థ ఓ కొత్త రిపోర్ట్ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు.. అంటే 12 రోజుల్లోనే జోషీమఠ్ పట్టణం 5.4 సెంటీమీటర్ల మేర కుంగిపోయినట్లు ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తన రిపోర్ట్లో పేర్కొంది. ఇందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను కూడా రిలీజ్ చేసింది. కార్టోశాట్-2ఎస్ శాటిలైట్ ఈ చిత్రాలను తీసింది. అయితే, ప్రస్తుతం ఈ నివేదిక ఇస్రో వెబ్ సైట్లో కనిపించడంలేదు. నివేదికకు సంబంధించిన లింక్ను ఇస్రో తొలగించింది.
ఈ తరుణంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్ డీఎంఏ) మీడియాకు ఓ మెమోరాండం విడుదల చేసింది. జోషీమఠ్ కుంగుబాటుపై ప్రభుత్వ రంగ సంస్థలు సొంతంగా విడుదల చేస్తున్న నివేదికలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని పేర్కొంది. స్థానికులతో పాటు దేశవ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించేలా ప్రకటనలు చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన ఉన్నతస్థాయి భేటీలో చర్చకు వచ్చిందని తెలిపింది. దీంతో ఈ విషయంపై నేరుగా మీడియాతో మాట్లాడొద్దంటూ శాస్త్రవేత్తలకు ప్రభుత్వం సూచించినట్లు వివరించింది.