ముంబై: ఉత్తరప్రదేశ్ ఏమైనా పాకిస్థాన్లో ఉందా? అని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఆ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అక్కడి బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు. లఖింపూర్ ఖేరీలో 144 సెక్షన్ విధించి, లక్నోలో ప్రతిపక్ష నేతలను నిర్బంధించడం ఏమిటని నిలదీశారు. ‘లఖింపూర్ ఖేరీలో 144 సెక్షన్ విధించారు. మీరు (ప్రభుత్వం) లక్నోలో (విపక్ష నేతలను) అరెస్టు చేస్తున్నారు. ఇది ఎలాంటి చట్టం? యూపీ పాకిస్థాన్లో ఉందా? భారతీయులు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? దేశంలో కొత్త రాజ్యాంగం ఉన్నదా? ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి కదలికలో ఆంక్షలు ఉన్నాయా? ఇది ఏమైనా కొత్త లాక్డౌనా?’ అని వరుస ప్రశ్నలు సంధించారు.
యూపీలో పాలక పక్షం పంజరంలో ఉన్న చిలుక లాగా అధికారుల తీరు ఉన్నదని, ప్రభుత్వం ఏ ఆదేశాలు ఇచ్చినా వారు అనుసరిస్తున్నారని సంజయ్ రౌత్ విమర్శించారు. రైతులపైకి వాహనాన్ని దూకించడంపై ఆధారాలు ఉన్నాయన్నారు. లఖింపూర్ ఖేరీకి అఖిలపక్ష బృందాన్ని పంపడంపై అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి చర్చించి నిర్ణయిస్తాయని ఆయన చెప్పారు.