తిరువనంతపురం: ఇప్పటికే భారీగా వస్తున్న కరోనా కేసులతో సతమతమవుతున్న కేరళను ఇప్పుడు నిపా వైరస్( Nipah virus ) మళ్లీ వణికిస్తోంది. ఆదివారం కోజికోడ్లో ఓ 12 ఏళ్ల బాలుడు నిపా కారణంగా మరణించాడన్న వార్త కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం అధికారులు స్వల్ప లక్షణాలు కనిపించిన 8 మంది రక్త నమూనాలతోపాటు ఓ పండును కూడా పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆప్ వైరాలజీకి పంపించారు.
ఆ పండు ఏంటి?
ఈ పండు పేరు రేంబుటాన్. దీనిని తినడం వల్లే ఆ బాలుడికి వైరస్ సోకి ఉండొచ్చని ఆ బాలుడి ఇంట్లోని వాళ్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు దీనిని పరీక్షల కోసం పంపించారు. ఇప్పటికే కేరళకు చేరిన కేంద్ర బృందం.. ఆ బాలుడి ఇంటికి వెళ్లింది. కుటుంబ సభ్యులను వివరాలు అడిగిన తర్వాత వాళ్లింటి దగ్గర్లో ఉన్న ఈ రేంబుటాన్ పండ్ల నమూనాలను కూడా తీసుకున్నారు. ఇప్పుడా బాలుడి ఇంటి చుట్టుపక్కల 3 కిలోమీటర్ల మేర కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. మొత్తం 188 మంది ప్రైమరీ కాంటాక్ట్లను గుర్తించారు. చాతమంగళం పంచాయత్తోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను పూర్తిగా నిర్బంధంలో ఉంచారు.
ఎంత మంది ఉన్నారో?
బాలుడి ప్రైమరీ కాంటాక్ట్ల సంఖ్య మరింత ఎక్కువే ఉండొచ్చని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి వెల్లడించారు. ఆ బాలుడిని తల్లిదండ్రులు మొదట స్థానిక క్లినిక్కు, తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కు, అక్కడి నుంచి ఓ మెడికల్ కాలేజీకి, మళ్లీ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. దీంతో అక్కడున్న వాళ్లంతా ప్రైమరీ కాంటాక్ట్లుగానే అనుమానిస్తున్నారు. కాంటాక్ట్లను గుర్తించడానికి ఫీల్డ్ వర్కర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు.
బాలుడికి గత నెల 27న జ్వరం రాగా.. హాస్పిటల్లో చేర్చారు. ఆ రోజు నుంచి ఆ బాలుడు ఎప్పుడు, ఎక్కడ ఉన్నాడన్నదానిపై ఆరోగ్య శాఖ ఓ సవివరమైన రూట్ మ్యాప్ను రూపొందించింది. అసలు వైరస్ మళ్లీ ఎక్కడి నుంచి వచ్చిందన్నది చాలా ముఖ్యమని, ఈ బాలుడికే మొదట వచ్చిందా లేదంటే ఎవరి ద్వారా అయినా సోకిందా అన్నదానిని గుర్తించాల్సిన అవసరం ఉన్నదని వీణా జార్జి అన్నారు.