ముంబై: మహారాష్ట్రలో సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసు పలు మలుపులు తిరుగుతున్నది. తన కుమార్తె బతికే ఉందని హత్యారోపణలు ఎదుర్కొంటున్న షీనా బోరా తల్లి, ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ, ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు పలుసార్లు తెలిపింది. చాలా కాలంగా తనకు తెలిసిన వ్యక్తి, న్యాయవాది సవీనా బేడీ సచార్ ఈ నెల 5న గౌహతికి వెళ్లిందని, అక్కడి విమానాశ్రయంలో షీనా బోరా ఆమెకు కనిపించినట్లు కోర్టుకు చెప్పింది. మొబైల్ ఫోన్లో సచార్ రికార్డ్ చేసిన వీడియో క్లిప్తోపాటు ఆమె అఫిడవిట్ను కోర్టుకు సమర్పించింది. ఈ నెల 5న ఉదయం 5.30 గంటల నుంచి 6 గంటల మధ్య గౌహతి ఎయిర్పోర్ట్లోని బోర్డింగ్ గేట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి షీనా బోరాను పోలిన మహిళను గుర్తించాలని ఇంద్రాణి తరుఫు న్యాయవాది కోర్టును కోరారు.
కాగా, సీబీఐ తరుఫు న్యాయవాది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 2012లో హత్యకు గురైన షీనా బోరా బతికి లేదని, తల్లి ఇంద్రాణి, ఆమె మాజీ భర్త, కారు డ్రైవర్ కలిసి ఆమెను హత్య చేసినట్లు సీబీఐ దర్యాప్తులో తేలిందని కోర్టుకు తెలిపారు. కేసు విచారణను పక్కదారి పట్టించేందుకు ఇంద్రాణి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. గతంలో కూడా జమ్ముకశ్మీర్లోని దాల్ సరస్సు వద్ద షీనా బోరా కనిపించినట్లు ఆమె చెప్పిన సంగతిని గుర్తుచేశారు. ప్రస్తుతం కోర్టుకు సమర్పించిన వీడియో క్లిప్లోని మహిళ మాస్క్ ధరించిందని, ఆమెను గుర్తించడం కష్టసాధ్యమన్నారు.
మరోవైపు షీనా బోరా బతికే ఉన్నట్లు ఇంద్రాణి ముఖర్జీ పదే పదే చెబుతున్నదని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్పీ నాయక్ నింబాల్కర్ తెలిపారు. ఈ నేపథ్యంలో గౌహతి ఎయిర్పోర్ట్ బోర్డింగ్ గేట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తే వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించారు. షీనా బోరా కనిపించినట్లుగా పేర్కొన్న జనవరి 5వ తేదీ ఉదయం 5.30-6.00 గంటల మధ్య రికార్డైన సీసీటీవీ ఫుటేజీని ఫిబ్రవరి 2 నాటికి కోర్టుకు సమర్పించాలని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)ను ఆదేశించారు.