న్యూఢిల్లీ: దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను కేంద్ర మంత్రి అమిత్ షా పొగడడంపై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) ఆశ్చర్యపోయారు. ‘ఇది పగలా? రాత్రా?’ (Is It Day Or Night?) అని సంశయం వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీని తన గుప్పిట్లో ఉంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఢిల్లీ సేవల బిల్లుపై లోక్సభలో గురువారం చర్చ జరిగింది. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ బిల్లు గురించి సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశ తొలి ప్రధాని నెహ్రూ స్టేట్మెంట్ను ఆయన ప్రస్తావించారు.
కాగా, ఏండ్లుగా పాలించిన కాంగ్రెస్, నెహ్రూ దేశాన్ని నాశనం చేశారంటూ బీజేపీ నేతలు మండిపడేవారు. అయితే దీనికి భిన్నంగా నెహ్రూ గురించి అమిత్ షా మాట్లాడటంపై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆశ్చర్యపోయారు. దీని గురించి సభలో ఆయన మాట్లాడారు. నెహ్రూని, కాంగ్రెస్ పార్టీని అమిత్ షా పదే పదే పొగడడం చాలా బాగున్నదని తెలిపారు. ‘ఇది పగలా? రాత్రా?.. నేను ఏం చూస్తున్నాను అని మనసులో అనుకున్నా. అమిత్ షా వద్దకు వెళ్లి ఆయన నోట్లో స్వీట్ పెట్టాలనుకున్నా. ఎందుకంటే ఆయన తన నోటితో నెహ్రూ, కాంగ్రెస్ను ప్రశంసించడం నాకు సంతోషంతోపాటు ఆశ్చర్యాన్ని కలిగించింది’ అని అధిర్ చౌదరి అన్నారు.
అయితే అమిత్ షా వెంటనే జోక్యం చేసుకున్నారు. నెహ్రూను తాను పొగడలేదని, కేవలం ఆయన చెప్పిన మాటలను ఉటంకించానని అన్నారు. దీనిని వారు (కాంగ్రెస్) ప్రశంసగా పరిగణించాలనుకుంటే దానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. దీనిపై అధిర్ రంజన్ చౌదరి ప్రతిస్పందించారు. మీకు అవసరమైనప్పుడల్లా నెహ్రూ మద్దతు తీసుకోవచ్చని అమిత్ షాకు సూచించారు. మీరు అలా చేసి ఉంటే మణిపూర్, హర్యానా వంటి సంఘటనలను తాము చూడవలసిన అవసరం ఉండేది కాదన్నారు.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ తమ గుండె అని అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. ఎన్నికైన ప్రభుత్వ అధికారాలను హరించివేసే బిల్లును ఢిల్లీ కోసం చేస్తే, ఇతర రాష్ట్రాలపై కూడా కేంద్రం ఇలా దాడి చేయవచ్చన్న సందేహాలు ప్రతిపక్షాలకు ఉన్నాయని అన్నారు. ఢిల్లీలో కుంభకోణాలు జరుగుతున్నాయని మీరు (కేంద్రం) అనుకుంటే ఈడీ, సీబీఐ వంటి చాలా ఏజెన్సీలు మీ వద్ద ఉన్నాయిగా అంటూ ఎద్దేవా చేశారు. కేవలం స్కామ్ ఆరోపణలతో అలాంటి బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఉందా? అని చౌదరి ప్రశ్నించారు.