నేటితో ముగియనున్న కేంద్రం ‘కోడ్ ఆఫ్ ఎథిక్స్’ గడువు
న్యూఢిల్లీ, మే 24: దేశీయ ఫేస్బుక్, ట్విట్టర్ సేవలు బుధవారం నుంచి నిలిచిపోనున్నాయా? సామాజిక, డిజిటల్ మాధ్యమాల్లోని కంటెంట్ను నియంత్రించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ‘కోడ్ ఆఫ్ ఎథిక్స్’ పేరిట కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. వీటికి సంబంధించి యూజర్ల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి మూడంచెల్లో గ్రీవెన్స్ ఫ్రేమ్వర్క్ను సిద్ధం చేసుకోవాలని కంపెనీలకు సూచించింది. దీని కోసం మే 25ను డెడ్లైన్గా నిర్ణయించింది. అయితే ప్రముఖ సామాజిక దిగ్గజాలు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు ఇప్పటికీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఫిర్యాదుల పరిష్కారానికి భారతీయ అధికారులను నియమించడం, అభ్యంతరకరమైన కంటెంట్ను గుర్తించే పర్యవేక్షణ, మెకానిజమ్ను ఆయా సంస్థలు ఇంకా ఏర్పాటు చేసుకోలేదని పేర్కొన్నాయి. దీంతో బుధవారం నుంచి సోషల్ మీడియా సైట్లు, ఓటీటీలు బంద్ అవుతాయా? అన్న చర్చ మొదలైంది.