HD Kumaraswamy on Agnipath | సైనిక బలగాల్లో నియామకానికి కేంద్రం అమల్లోకి తెస్తున్న అగ్నిపథ్ స్కీం విధానాన్నిజేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి ప్రశ్నించారు. దీని వెనుక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) రహస్య ఎజెండా దాగి ఉందని ఆరోపించారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సైన్యంపై పట్టు సాధించేందుకు కేంద్రంలోని అధికార బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆరెస్సెస్ ప్రతిపాదించిన స్కీం అగ్నిపథ్ అని పేర్కొన్నారు. జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ సారధ్యంలోని నాజీ పార్టీ తరహాలోనే సైన్యంపై పట్టు కోసం ఆరెస్సెస్ ప్రయత్నిస్తున్నదా? అని ప్రశ్నించారు.
ఆదివారం రామనగరలో మీడియాతో మాట్లాడుతూ.. `ఈ అంశంపై మాట్లాడేందుకు ఢిల్లీ ఇక్కడ లేదు. కేంద్ర ప్రభుత్వానికి అగ్నిపథ్ భావనను అందచేసిందెవరు.. ఏ పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. సైనిక బలగాల్లో 10 లక్షల మందిని నియమించడానికి అగ్నిపథ్ స్కీమ్ ప్రారంభించాలని ప్రతిపాదన ఎక్కడ నుంచి వచ్చింది. రక్షణ శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనేనా? ఈ సలహా ఇచ్చిందెవరు?` అని కుమారస్వామి నిలదీశారు.
`ఈ 10 లక్షల మంది యువతను సైనిక బలగాల్లో ఎవరు నియమిస్తారు? ఆరెస్సెస్ శిక్షణ పొందిన అభ్యర్థులు ఉంటారా? ఆరెస్సెస్ కార్యకర్తలుగా శిక్షణ పొందిన వారికి సైన్యంలో ఉపాధి కల్పించడానికి ఇది ఒక ప్రణాళికా? ఈ సంఘ్ కార్యకర్తలు 2.5 లక్షల మందిని నియమించడానికి ఏర్పాటు చేసిన స్కీం ఇది. ఆరెస్సెస్ రహస్య ఎజెండా ఇది, నాలుగేండ్ల సర్వీసు పూర్తయిన తర్వాత రూ.11 లక్షల పరిహారంతో బయటకు వచ్చిన మిగతా 75 శాతం మంది సైనిక సిబ్బంది ఆరెస్సెస్ శక్తిగా మారరా? అని ప్రశ్నించారు.