What Worries the World | ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పలురకాల సమస్యలతో ఆందోళనకు
గురవుతున్నారు. నిరుద్యోగం, పెరుగుతున్న ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ అంశంపై భారత్లో
నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. పట్టణ భారతీయులు ప్రస్తుతం నిరుద్యోగం, అవినీతి,
ద్రవ్యోల్బణంపై ఆందోళన చెందుతున్నట్లు ఐపీఎస్ఓఎస్ (IPSOS) సర్వేలో తేలింది.
ప్రతి పది మంది భారతీయుల్లో ఇద్దరు ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేసినట్లు ఐపీఎస్ఓఎస్ సర్వే ‘వాట్ వర్రీస్ ది వరల్డ్’ నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పౌరులను ఆందోళనకు గురి చేస్తుందని నివేదిక తెలిపింది. ఇది గత నెలలో రెండుశాతం పెరిగిందని చెప్పింది. మరో వైపు ప్రపంచస్థాయిలో పేదరికం, సామాజిక అసమానత, నిరుద్యోగం, హింసాత్మక నేరాలు, ఆర్థిక, రాజకీయ అవినీతి సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, భారత్ సరైన దిశలో పయనిస్తోందని 76శాతం మంది విశ్వాసం వ్యక్తం చేయగా.. ఈ జాబితాలో సౌదీ అరేబియా ముందు వరుసలో నిలిచింది. సౌదీ అరేబియా సరైన దిశలోనే ముందుకు సాగుతోందని 93శాతం మంది పేర్కొన్నారు. సర్వే ఫలితాలపై ఏపీఎస్ఓఎస్ సీఈవో అమిత్ అడార్కర్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి ప్రభావంతో పాటు ప్రపంచ మందగమనం భారతదేశం వంటి మార్కెట్లలో కనిపిస్తోందన్నారు.
ఇది ఉద్యోగాలపై ప్రభావం చూపుతోందని, ఇది అవినీతి, నేరాల పెరుగుదలకు దారి తీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ఆన్లైన్ ప్యానెల్ సిస్టమ్ ద్వారా సెప్టెంబర్- అక్టోబర్ మధ్య ఐపీఎస్ఓఎస్ ఈ సర్వే చేపట్టింది. ‘వాట్ వర్రీస్ ది వరల్డ్’ సర్వే దేశాల్లో అత్యంత ముఖ్యమైన సామాజిక, రాజకీయ సమస్యలపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తోంది.