న్యూఢిల్లీ : ఐపీఎస్ అధికారి సంజుక్తా పరాశర్ను సీఆర్పీఎఫ్కు చెందిన ప్రత్యేక జంగిల్ వార్ఫేర్ కమాండో విభాగం ‘కోబ్రా’కు ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ)గా నియమించారు. ఈ పదవిని చేపట్టనున్న తొలి మహిళగా ఆమె నిలిచారు. సంజుక్తా పరాశర్ 2006 బ్యాచ్కు చెందిన అసోం- మేఘాలయ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఈ మేరకు కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) ప్రధాన కార్యాలయం గతవారం ఉత్తర్వులు జారీ చేసింది.
1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి దానేశ్ రాణా స్థానంలో ఆమె ‘కమాండో బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్'(కోబ్రా) ఐజీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ‘పది బెటాలియన్లతో కూడిన సీఆర్పీఎఫ్ కోబ్రాకు ఒక మహిళా అధికారి నాయకత్వం వహించడం ఇదే తొలిసారి అని ఓ సీనియర్ అధికారి ‘పీటీఐ’కి తెలిపారు. భారత్లోని పలు రాష్ర్టాల్లో వామపక్ష తీవ్రవాదం(ఎల్డబ్ల్యూఈ), ఈశాన్య రాష్ర్టాల్లోని కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాటు కార్యకలాపాలను ఎదుర్కొనేందుకు సీఆర్పీఎఫ్ 2008-09లో ‘కోబ్రా’ను ఏర్పాటు చేసింది.