న్యూఢిల్లీ, మే 21: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ ప్రియులు అత్యధికంగా ఇష్టపడే బ్రాండ్ ఐఫోన్. అత్యాధునిక టెక్నాలజీతోపాటు యూజర్ భద్రతకు భరోసా ఉండటంతో కోట్లమంది ఐఫోన్ వాడటానికి ఇష్టపడుతుంటారు. అయితే, కొత్తగా వచ్చిన ఐఫోన్లలోకి మాల్వేర్లు తేలిగ్గా చొరబడే ప్రమాదం ఉన్నదని జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ ధర్మ్స్టాడ్ పరిశోధనలో తేలింది. కొత్త ఐఫోన్లు స్విచాఫ్ చేసిన తర్వాత కూడా అంతర్గతంగా పనిచేస్తూనే ఉన్నాయని గుర్తించారు. లో పవర్ మోడ్, లొకేట్ లాస్ట్ డివైజ్ వంటి ఫీచర్ల కోసం ఐఫోన్లలో కొత్తగా వాడుతున్న వైర్లెస్ చిప్స్ ఫోన్లు స్విచాఫ్ చేసినా నిరంతరం రన్ అవుతున్నాయని పరిశోధకులు తెలిపారు. దీనివల్ల ఏదైనా మాల్వేర్ దాడిచేసినప్పుడు మనం ఫోన్ స్విచాఫ్ చేసి భద్రంగా ఉందని అనుకొంటే పొరపాటేనన్నారు.