న్యూఢిల్లీ, జనవరి 26: ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో కీలకంగా ఉండే జాట్ ఓటర్లను మభ్యపెట్టేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ నేత జయంత్ చౌదరి తిప్పికొట్టారు. జయంత్ తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారని, జయంత్ కోసం తమ పార్టీ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని వెస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ.. బుధవారం జయంత్కు బహిరంగ ఆహ్వానం పలికారు. దీనిపై జయంత్ చౌదరి ఘాటుగా స్పందించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో అమరులైన రైతులను ప్రస్తావిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘ఆహ్వానం నాకు కాదు.. మీ వైఖరితో మరణించిన 700 రైతుల కుటుంబాలకు పంపండి’ అని ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో ఎస్పీతో కలిసి ఆర్ఎల్డీ పోటీచేస్తున్నది.