న్యూఢిల్లీ : దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై ఏర్పాటైన త్రివిధ దళాల దర్యాప్తు బృందం శుక్రవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నది. ఎయిర్ మార్షల్ మన్వేంద్ర సింగ్ నేతృత్వంలో ప్రమాదంపై దర్యాప్తు జరుగుతున్నది. ఇందులో ఆర్మీ, నేవీకి చెందిన ఇద్దరు బ్రిగేడియర్ ర్యాంక్ అధికారులు ఉన్నారు. ఈ నెల 8న జరిగిన ఘటనకు సంబంధించి అధికారులు కూలంకషంగా విచారణ జరిపి, ఆ తర్వాత సవివరణంగా నివేదికను సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇందులో బ్లాక్బాక్స్ నుంచి సేకరించిన డేటాను సైతం విశ్లేషించారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ప్రమాదం అకస్మాత్తుగా జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ నెల 8న తమిళనాడులోని కూనూర్ వద్ద ఎంఐ-17 హెలికాప్టర్ కూలిపోయిన విషయం తెలిసిందే. ఘటనలో దేశ తొలి సీడీఎస్గా నియామకమైన జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు మరో 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.